T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ ప్రకారం జరగడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో రెండు నిపా (Nipah) వైరస్ కేసులు నమోదు కావడంతో.. ఈ మెగా టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ భయాందోళనలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరియు ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చాయి.
అసలేం జరిగింది?
పశ్చిమ బెంగాల్లోని బరాసత్ ప్రాంతంలో ఇద్దరికి నిపా వైరస్ పాజిటివ్గా తేలింది. ఈ ప్రాంతం వరల్డ్ కప్ సెమీఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనున్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఆందోళన మొదలైంది.
ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
ఇవి డిసెంబర్లో నమోదైన కేసులు. ఆ ఇద్దరు రోగులను అప్పుడే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించారు. వారితో కాంటాక్ట్ అయిన 196 మందిని పరీక్షించగా, ఎవరికీ వైరస్ సోకలేదని తేలింది. ప్రస్తుతం కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదు. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితి ఏదీ లేదని స్పష్టం చేశాయి.
Also read: Suryakumar Yadav -టీ20ల్లో ‘స్కై’ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్లను సైతం వెనక్కి నెట్టి మరీ..
“ఇది కేవలం దుష్ప్రచారం”: బీసీసీఐ
వైరస్ భయంతో మ్యాచ్లు తరలిస్తారా? అన్న ప్రశ్నకు బీసీసీఐ (BCCI) గట్టి సమాధానం ఇచ్చింది. “ఆటగాళ్ల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం కేవలం భయాందోళనలు సృష్టించే ప్రయత్నం మాత్రమే. టోర్నీ నిర్వహణకు ఎలాంటి ముప్పు లేదు. వేదికల మార్పుపై ఎలాంటి చర్చలు జరగడం లేదు” అని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
తప్పుడు సమాచారంపై జాగ్రత్త!
కోవిడ్ లాగా నిపా వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. ఇది కేవలం సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం లేదా కలుషిత ఆహారం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. థాయిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నా, అది కేవలం ముందుజాగ్రత్త చర్య మాత్రమే. సోషల్ మీడియాలో, ముఖ్యంగా పాకిస్థాన్కు చెందిన కొన్ని ఖాతాల నుంచి వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.
షెడ్యూల్ యథాతథం
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో మ్యాచ్లు జరగనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సెమీఫైనల్తో సహా 6 మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. ఐసీసీ గానీ, ఇతర దేశాల క్రికెట్ బోర్డులు గానీ భద్రతపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.

