Rajasthan Royals: ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా డగౌట్లో మొబైల్ ఫోన్ వాడినట్లు వస్తున్న ఆరోపణలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది.
అసలేం జరిగిందంటే: రెండు రోజుల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఉల్లంఘన వెలుగుచూసింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతున్నాడు. అంతేకాకుండా పక్కనే ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అందులో ఏదో చూస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అవినీతి నిరోధక విభాగం (ACU) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో ఉన్న ఆటగాళ్లు కానీ, సపోర్ట్ స్టాఫ్ కానీ మొబైల్ ఫోన్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను వాడకూడదు. ఇది తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించబడుతుంది.
Also read-CSK vs DC: సంజూ శాంసన్ సూపర్ సెంచరీ.. చెన్నై సూపర్ కింగ్స్ తొలి విక్టరీ
భారీ జరిమానా తప్పదు: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై భారీ మొత్తంలో పెనాల్టీ విధించే ఛాన్స్ ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన మేనేజర్ రోమి భిందర్ను లీగ్ నుండి సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా మొబైల్ చూస్తున్నట్లుగా కనిపిస్తున్న వైభవ్ సూర్యవంశీపై ఒకటి లేదా రెండు మ్యాచ్ల పాటు నిషేధం విధించే వీలుందని సమాచారం. ఒకవేళ వైభవ్ సూర్యవంశీపై వేటు పడితే కీలక దశలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అయతే బీసీసీఐ నుండి ఇంతవరకు ఈ అంశంపై ఎటాంటి ప్రకటన వెలువడలేదు.

