ఈ మధ్య కాలంలో డివోర్స్లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పలువురు క్రికెటర్లు ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఆటగాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. మొదట్లో వీరిద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నప్పటి నుంచి ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ధనశ్రీ పెట్టిన కొన్ని పోస్టుల బట్టి చూస్తే.. నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని స్పష్టంగా అర్థమైంది.
తాజాగా పరస్పర అంగీకారంతో వీరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ధనశ్రీవర్మ, చాహల్ ఇద్దరూ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్కు హాజరయ్యారు. 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా తామిద్దరం విడిపోవడానికే నిశ్చయించుకున్నట్టు కోర్టుకు తెలిపారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు చెప్పారు. ఈ ఇద్దరూ 18 నెలలుగా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత ఆ జంట అధికారికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విడాకుల తర్వాత యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీకి రూ.60 కోట్ల భరణం చెల్లించాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
దీనిపై ధనశ్రీ న్యాయవాది అదితి మోహని మాట్లాడుతూ.. భరణం వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉందని.. మీడియా వార్తలు రాసే ముందు ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచించారు. నిజానికి రూ.60 కోట్ల భరణం అంటూ ఫేక్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనశ్రీ వర్మను దారుణంగా ట్రోల్ చేశారు. కొందరు ధనశ్రీ వర్మను అవకాశవాది, గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్లు చేశారు.
దీనికి ధనశ్రీ కుటుంబ సభ్యులు స్పందించారు. భరణం గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందడం పట్ల తాము చాలా విచారంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని.. ఇంత మొత్తం ఎప్పుడూ అడగలేదని.. డిమాండ్ చేయలేదు లేదా అందించలేదని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని వాటిలో నిజం లేదని కొట్టిపారేశారు. నిజం తెలియకుండా సమాచారాన్ని ప్రచురించడం బాధ్యతారహిత చర్య అంటూ పేర్కొన్నారు.