Chinnaswamy Stadium: బెంగళూరులో గత జూన్ 4న తొక్కిసలాట ఘటన జరిగింది. దీంతో, పలువురు చనిపోయారు. అయితే, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించొద్దని పలు నివేదికలు వచ్చాయి. భారీగా ప్రేక్షకులు వచ్చేలా స్టేడియం సామర్థ్యం లేదని అందులో పేర్కొన్నాయి. దీంతో మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లను కూడా వేరే వేదికకు తరలించింది. అయితే, తాజాగా కర్ణాటక క్రికెట్ సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. దీంతో మళ్లీ ఆ స్టేడియంలో మ్యాచులను నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. కె.తిమ్మప్పయ్య మెమోరియల్ ట్రోఫీలో 16 జట్లు పాల్గొంటాయి. కర్ణాటక స్టేట్ అసోసియేషన్ ఆధ్వరంలో జరిగే ఈ రెడ్బాల్ టోర్నీ మ్యాచుల్లో ఆరింటిని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో సెమీస్తోపాటు ఫైనల్ కూడా ఉండనుంది. సెప్టెంబర్ 26 నుంచి ఈ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే, నిర్వాహకులు ఓ షరతు పెట్టారు. అభిమానులకు అనుమతి లేకుండా మ్యాచులను నిర్వహించాలన్నారు. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ట్రోఫీలో ముంబయి, విదర్భ, మధ్యప్రదేశ్, హిమాచల్, ఛత్తీస్గఢ్ తదితర టీమ్లు ఆడనున్నాయి. క్రికెటర్లు అజింక్య రహానె, హనుమ విహారి, వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్, శశాంక్ సింగ్.. తదితర ప్లేయర్లు బరిలోకి దిగనుండటంతో టోర్నీకి స్టార్ కళ రానుంది.
Read Also: Trump: మూడు యుద్ధాలు ఆపా.. మరోసారి మాట మార్చిన ట్రంప్
ఐపీఎల్ సీజన్ లో..
కర్ణాటక నిర్వహిస్తోన్న టోర్నీ విజయవంతమైతే.. రాబోయే కాలంలో మిగతా దేశవాళీ మ్యాచులను నిర్వహించేందుకు ఆస్కారం ఉంది. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మ్యాచులకు కొత్త వేదికను చూడాల్సిన అవసరం లేకుండా పోతుంది. అయితే, ఐపీఎల్కు భారీ ఎత్తున అభిమానులు తరలివస్తారు. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ బరిలోకి దిగనుడటం వల్ల ఆ జట్టుపై భారీ అంచనాలే పెట్టుకుంటారనేది కాదనలేని వాస్తవం. మరి బీసీసీఐ, కర్ణాటక ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Also: GST reforms: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో నష్టమే.. ఎస్బీఐ రిపోర్టులో వెల్లడి
విషాదంగా ఆర్సీబీ విజయోత్సవ వేడుక
ఇకపోతే, బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుక 15 నిమిషాల్లోనే తీవ్ర విషాదంగా మారిపోయింది. ముఖ్యంగా తమ రాష్ట్రానికి చెందిన జట్టు కప్ను గెలుచుకోగా.. క్రికెటర్లను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ముఖ్యంగా 35 వేల మంది మాత్రమే వస్తారని అంచనా వేయగా 2 నుంచి 3 లక్షల మంది వరకు వెళ్లారు. టిక్కెట్లు లేకపోయినా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణించిన వారందరూ 30 ఏళ్లు లోపు వారే కావడం గమనార్హం. కాగా, బెంగళూరు దుర్ఘటనపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి మైఖేల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ ఆర్సీబీ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసింది. తదనంతర పరిణామాల్లో ఆర్సీబీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. బెంగళూరులో శ్రద్ధాంజలి స్థూపం నిర్మించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా 6-పాయింట్ల మానిఫెస్టోను విడుదల చేసింది.


