CP Sajjanar fires on shikar dhawan and suresh raina: టీమిండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. సమాజాన్ని ఛిద్రం చేస్తున్న బెట్టింగ్ మహమ్మారి ప్రమోషన్స్లో ఎలా భాగం పంచుకుంటారని మండిపడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో రైనా, ధావన్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. గురువారం వీరిద్దరికీ సంబంధించిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందుకు సంబంధించి వార్తా పత్రికల్లో వెలువడిన కథనాలను ట్యాగ్ చేస్తూ సీపీ సజ్జనార్.. ‘ఎక్స్’ వేదికగా మాజీ క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా?. సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పాలి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి’ అంటూ ‘X’ వేదికగా సజ్జనార్ హితవు పలికారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సైట్ వన్ ఎక్స్బెట్ (1xBet)కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు చెందిన రూ. 4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని ఈడీ కేంద్ర ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. ఇక సురేశ్ రైనాకు చెందిన రూ. 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ను ఫ్రీజ్ చేసింది. కాగా, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇటీవల ఈడీ వీరిద్దరినీ ప్రశ్నించింది. దర్యాప్తు సమయంలో వారి వాంగ్మూలాలు సైతం నమోదు చేసింది.
కాగా, బెట్టింగ్స్ యాప్స్కు మద్దతుగా గతంలో పలువురు ప్రముఖ సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు ప్రచారం నిర్వహించారు. రైనా, ధావన్తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నటీనటులు సోనూసూద్, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి, అంకుష్ హజ్రాతో పాటు పలువురిని ఈడీ విచారించింది. ఈ నేపథ్యంలో ప్రజల అభిమానాన్ని ఇలా సొమ్ము చేసుకుంటూ.. మనీ లాండరింగ్కు పాల్పడటంతో వీరిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీళ్లేం సెలబ్రిటీలు?
అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?
బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని… pic.twitter.com/GWJIvSK7uF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 7, 2025


