Kadapa Girl Sri Charani Success Story in Telugu: భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో మన తెలుగమ్మాయి శ్రీచరణి పాత్ర మరువలేనిది. ఎడమ చేతివాటం స్పిన్నర్ అయిన శ్రీచరణి తన బౌలింగ్ తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ఈ వరల్డ్ కప్ లో మెుత్తం 78 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీచరణి 14 వికెట్లు తీసింది. ఫైనల్ పోరులో కూడా సౌతాఫ్రికా బ్యాటర్ అన్నేకే బోష్ ను డకౌట్ చేసింది. అప్పటి నుంచే మ్యాచ్ మలుపు తిరిగింది. అందరి చేత ప్రశంసలు అందుకున్న శ్రీచరణి సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లపురెడ్డి శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందినది. ఈ 21 ఏళ్ల అమ్మాయి 16 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉద్యోగిగా పనిచేసేవారు.శ్రీచరణి క్రికెట్ కోచింగ్ తీసుకోవడానికి ఆమె తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. ఆమె మెుండి పట్టుదల పట్టడంతో శిక్షణ తీసుకోవడానికి ఆంగీకరించారు. తల్లిదండ్రుల తర్వాత ఆమెకు మామ వరుస అయిన కిషోర్ కుమార్ రెడ్డి ఎక్కువ సపోర్టు చేశారు. తొలుత ఫాస్ట్ బౌలర్ గా శిక్షణ ప్రారంభించిన చరణి.. వికెట్లు రాకపోవడంతో స్పిన్ బౌలింగ్ కు మారింది.
Also Read: viral video -భారత్ కప్ గెలవడంపై ఈ బాలిక మాటలు వింటే షాక్ అవుతారు..
ఈ ఏడాది ఏప్రిల్ లో శ్రీలంకపై తొలి వన్డే మ్యాచ్ ఆడింది. జూన్ లో ఇంగ్లాండ్ పై టీ20 డెబ్యూ చేసింది. ఈమెను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ రూ 55 లక్షల పెట్టి కొనుగోలు చేసింది. తన ఆటతీరుతో ఆకట్టుకుని ప్రపంచకప్ టీంలో చోటు దక్కించుకుంది. బ్యాటింగ్ కు కలిసొచ్చే పిచ్ లపై కూడా తన అద్బుతమైన బౌలింగ్ తో వికెట్లు రాబట్టింది. ఈమె ఫేవరెట్ క్రికెటర్స్ స్మృతి మంధాన మరియు యువరాజ్ సింగ్. శ్రీచరణి 2004 ఆగస్టు 04న జన్మించింది.


