టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul), బాలీవుడ్ నటి అతియా శెట్టి జంట పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాహుల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అభిమానులు, సెలబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సహచర ఆటగాడికి ప్రత్యేక విషెస్ చెప్పింది. జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్, మిచెల్ స్టార్క్, మెంటర్ కెవిన్ పీటర్సన్తో సహా ఆటగాళ్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్లో బేబీ-స్వేయింగ్ సంజ్ఞతో విష్ చేశారు. కాగా రాహుల్, అతియాలు 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సతీమణి ప్రసవం నేపథ్యంలో లక్నో మ్యాచ్కు రాహుల్ దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ జట్టు రూ.12 కోట్లకు రాహుల్ని కొనుగోలు చేసింది.
ఇదిలా ఉంటే సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ లక్నో టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ సమయంలో ఓటమి ఖాయం అనుకున్న దశ నుంచి అశుతోష్ శర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5×4, 5×6), విప్రాజ్ నిగమ్ (39; 15 బంతుల్లో 5×4, 2×6), ట్రిస్టన్ స్టబ్స్ (34; 22 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో ఢిల్లీ అనూహ్య విజయాన్ని అందుకుంది.