Ind Vs Eng 2nd Test: ఇండియా ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ని ఎంచుకుంది. తొలి టెస్ట్ వలె ఈ పిచ్ సైతం బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. టాస్ ఓడినా సరే మంచి స్కోర్ చేసి ఇంగ్లాడ్ బ్యాటర్లపై ఒత్తిడి తేవాలని శుభ్మన్ సేన భావిస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ ఓటమితో భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఇంగ్లాడ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ని కైవసం చేసుకుంది. దీంతో ఈ టెస్ట్లో టీమ్ ఇండియా భారీ మార్పులను చేసింది.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. అతని ప్లేస్లో ఆకాష్ దీప్కు అవకాశం లభించింది. దీంతో పాటు బ్యాంటింగ్లో రాణించేందుకు యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. ఇక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్కి ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం ఇచ్చారు. స్పిన్కి సైతం పిచ్ అనుకూలించే అవకాశం ఉండటంతో సుందర్ని తీసుకున్నట్లు తెలిసింది. దీంతో సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లకు టీమ్ నుంచి తప్పించారు.
మరోవైపు ఇంగ్లాడ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ని మార్పు చేయలేదు. తొలి మ్యాచ్లో విజయం సాధించిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్లో వాతావరణం కీలకంగా మారనుంది. ఎడ్జ్బాస్టన్లో మేఘావృత వాతావరణం నెలకొంది. దీంతో మ్యాచ్ మధ్యలో వర్షం పడే అవకాశాలు ఉండటంతో ఆటకు కాస్త అంతరాయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
మైదాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోవడం గమనార్హం. స్వింగ్కు అనుకూలమైన పిచ్ కావడంతో భారత ఓపెనర్లపై కాస్త ఒత్తిడిని పెంచేందుకు క్రిస్ వోక్స్, స్టోక్స్ తొలి బంతితో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ బ్యాటింగ్ను యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. తొలి ఓవర్లలో జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు తలపడి నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, కరుణ్ నాయర్పై భారత్ భారీ ఆశలు ఉన్నాయి.
ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. పైన చెప్పిన విధంగా ఈ మ్యాచ్లో వాతావరణం కీలకం కానుంది. బుమ్రా లేకుండా భారత్ బరిలోకి దిగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయినా కానీ జడేజా, సుందర్ స్పిన్ ద్వయంతో భారత్ గట్టి పోటీని ఇస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.