Messi Mumbai tour confirm: భారత ఫుట్బాల్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ అందింది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్కు రానున్నాడు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ విషయాన్ని ధృవీకరించారు. డిసెంబర్ 14, 2025న మెస్సీ తన గోట్ టూర్లో భాగంగా ముంబైకి రానున్నారు. 2011 తర్వాత మెస్సీ భారత్కు రావడం ఇదే మొదటిసారి. 14 ఏళ్ల తర్వాత రానుండంతో ఫుట్బాల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంకు ఫుట్బాల్ బహుమతి: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. మెస్సీ పర్యటన ఖరారైన సందర్భంగా ఆయన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు తన సంతకం చేసిన ఫుట్బాల్ను బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ స్వయంగా తన ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘లియోనెల్ మెస్సీ మహారాష్ట్రకు వస్తున్నారు.. నా యువ మిత్రులతో ఫుట్బాల్ ఆడబోతున్నారు! నాకు తను సంతకం చేసిన ఫుట్బాల్ను బహుమతిగా ఇచ్చినందుకు మెస్సీకి ధన్యవాదాలు! అంటూ ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 14న గోట్ టూర్లో భాగంగా ముంబైకి రాబోతున్న మెస్సీకి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత భారత్కు రాబోతున్నారు. గతంలో 2011లో కోల్కతాలో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం మెస్సీ భారత్కు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రావడం ఇదే తొలిసారి. దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Also Read:https://teluguprabha.net/sports-news/india-defeats-pakistan-in-super-4-match/
యువ ఆటగాళ్లకు మెస్సీతో శిక్షణ: మెస్సీ పర్యటన మహారాష్ట్రలోని యువ ఫుట్బాల్ క్రీడాకారులకు ఒక గొప్ప అవకాశం కానుందని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. రాష్ట్ర క్రీడా విభాగం, మిత్ర, వెస్టర్న్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ కలిసి మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 ఏళ్ల లోపు యువ క్రీడాకారులను ఎంపిక చేస్తున్నాయని ఆయన అన్నారు. డిసెంబర్ 14న ఈ యువ క్రీడాకారులకు మెస్సీతో కలిసి శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో యువతకు ఫుట్బాల్ పట్ల ఉన్న ఆసక్తిని మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సహాయం చేయాలని ఫడ్నవీస్ కార్పొరేట్ సంస్థలను కోరారు.


