CP Sajjanar on Betting Apps: బెట్టింగ్ ఊబిలో పడి బతుకును ఛిద్రం చేసుకోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ రోజు ఐపీఎల్ సీజన్ 19 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈజీ మనీ కోసం బెట్టింగ్కు బానిస అవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు X వేదికగా సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా మాత్రమే ఆస్వాదించాలని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించిందన్నారు. కానీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంల వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉందని అన్నారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ సీజన్ వేళ మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ తెలిపారు.

