Womens Cricket: మహిళల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనతకు ఐసీసీ నాంది పలికింది. ఇప్పటి వరకు పురుషుల వరల్డ్కప్కే భారీగా బహుమతులు కేటాయించగా, ఈసారి మహిళల వన్డే వరల్డ్కప్కే అత్యధిక ప్రైజ్మనీని అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో మహిళా క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో కొత్త శకానికి నాంది పలికిందని చెప్పవచ్చు.
మహిళల వన్డే వరల్డ్కప్..
2025లో జరగబోయే మహిళల వన్డే వరల్డ్కప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీ కోసం ఐసీసీ మొత్తం 13.88 మిలియన్ డాలర్లను ప్రైజ్మనీగా కేటాయించింది. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.122 కోట్లకు సమానం. రెండు సంవత్సరాల క్రితం న్యూజిలాండ్లో జరిగిన మహిళల వరల్డ్కప్తో పోలిస్తే ఈసారి బహుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. 2022లో టోర్నీ కోసం కేవలం 3.5 మిలియన్ డాలర్లు మాత్రమే కేటాయించగా, ఇప్పుడు 297 శాతం పెరుగుదలతో చరిత్ర సృష్టించారు.
4.48 మిలియన్ డాలర్లు..
విజేతగా నిలిచే జట్టుకు ఈసారి 4.48 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.39 కోట్లు లభించనున్నాయి. 2022లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అందుకున్న మొత్తంతో పోలిస్తే ఇది 239 శాతం ఎక్కువ. రన్నరప్గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.19 కోట్లు ఇవ్వనున్నారు. సెమీ ఫైనల్లో ఓడిపోయిన జట్లకు చెరో 1.12 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.9 కోట్లు అందుతాయి.
ఐసీసీ ప్రత్యేక ప్రోత్సాహకం..
గ్రూప్ దశలో పాల్గొనే జట్లకూ ఐసీసీ ప్రత్యేక ప్రోత్సాహకంగా కనీసం 2,50,000 డాలర్లు అంటే దాదాపు రూ.2 కోట్లు గ్యారెంటీగా ఇవ్వనుంది. అంతేకాకుండా గ్రూప్ స్టేజ్లో గెలిచిన ప్రతి మ్యాచ్కు అదనంగా 34,314 డాలర్లు అంటే సుమారు రూ.30 లక్షలు అందించనున్నారు. దీంతో ప్రతి జట్టుకు టోర్నీలో పాల్గొనే క్రమంలోనే గణనీయమైన ఆర్థిక లాభం కలుగుతుంది.
ప్రైజ్మనీని నాలుగు రెట్లు…
ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం మహిళల క్రికెట్ను మరింత ప్రోత్సహించడం అని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ, మహిళా క్రీడాకారిణులకు పురుషుల్లాంటి గౌరవం, గుర్తింపు ఇవ్వడం ముఖ్యమని తెలిపారు. ప్రైజ్మనీని నాలుగు రెట్లు పెంచడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం మహిళా క్రికెట్ను వృత్తిరంగంలో మరింత స్థిరంగా నిలబెట్టడం అని ఆయన పేర్కొన్నారు.
ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్తో వన్డే వరల్డ్కప్ ఆరంభం అవుతుంది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ టోర్నీ నవంబర్ 2న ఫైనల్ పోరుతో ముగియనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 జట్లు పాల్గొననున్న ఈ పోటీల్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంచనాలు ఉన్నాయి.
మహిళా క్రికెట్లో ఇది ఒక పెద్ద మలుపు అని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా టోర్నీలకు పెద్ద ఎత్తున నిధులు అందకపోయినా, ఇప్పుడు ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం మహిళల క్రీడలకు మరింత గుర్తింపు తీసుకురాబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


