ICC New Rules: క్రికెట్ ను ప్రేక్షకులకు మరింతగా చేరువచేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)నడుం బిగించింది. రోజురోజుకు క్రికెట్ పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఒకప్పుడు కేవలం 10-15 దేశాలు మాత్రమే క్రికెట్ ఆడేవి. ప్రస్తుతం అన్ని ఖండాల నుంచి క్రికెట్ ఆడేందుకు ఆయా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఫుట్ బాల్, టెన్నిస్, బాస్కెట్ బాల్, రగ్బీ ఆటల పట్ల క్రేజ్ ఉన్న కంట్రీస్ కూడా జెంటిల్మెన్ ఆట పట్ల ఇంట్రస్ట్ కనబరుస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాల్లోని పలు దేశాలు క్రికెట్ ప్రపంచంలోకి దూసుకువస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ఐసీసీ క్వాలిఫయర్ టోర్నీలు ఆడుతూ సత్తా చాటుతున్నాయి. దీంతో ఈ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఐసీసీ కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
తాజాగా ఇంటర్నేషనల్ మ్యాచ్ల కోసం రెండు కొత్త రూల్స్కు ఆమోదం తెలిపింది. బ్యాటింగ్, బౌలింగ్ మధ్య మధ్య సమతుల్యతను తిరిగి తీసుకురావడంతో పాటు ఆటగాళ్ల భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. సింగిల్ బాల్ రూల్, కన్కషన్ సబ్స్టిట్యూట్ రూల్ లో మార్పులు తీసుకుకొచ్చింది.
సింగిల్ బాల్ రూల్.. ప్రస్తుతం వన్డే మ్యాచులలో ఒక్కో ఎండ్ నుంచి ఒక బాల్ చొప్పున రెండు కొత్త బంతులను ఉపయోగిస్తున్నారు. అయితే కొత్త రూల్ ప్రకారం ఒకటో ఓవర్ నుంచి 34 ఓవర్ల వరకు రెండు కొత్త బంతులను ఉపయోగిస్తారు. కానీ 35వ ఓవర్ నుంచి ఫీల్డింగ్ జట్టు ఆ రెండు బంతుల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న బంతితోనే మిగిలిన ఓవర్లు బౌలింగ్ చేయాలి. వర్షం కారణంగా మ్యాచ్ 25 ఓవర్లు లేదా తక్కువ ఓవర్లకు తగ్గించబడితే ఒకే బంతిని ఉపయోగించాలి. ఈ రూల్ బౌలర్లకు రివర్స్ స్వింగ్, స్పిన్ చేయడంలో సహాయపడుతుంది. ఈ రూల్ను టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ICC మెన్స్ క్రికెట్ కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ఐసీసీ ఆమోదం తెలిపింది.
కన్కషన్ సబ్స్టిట్యూట్ రూల్.. ఈ రూల్ ప్రకారం టాస్కు ముందు వికెట్ కీపర్, బ్యాటర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్, ఆల్-రౌండర్(ఐదుగురు కన్కషన్ సబ్స్టిట్యూట్లను) మ్యాచ్ రిఫరీకి నామినేట్ చేయాలి. ఈ రూల్ ఆటగాళ్ల భద్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడనుంది. కాగా ఈ కొత్త రూల్స్ జూలై 2 నుంచి శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగే వన్డే సిరీస్తో అమలులోకి వస్తాయి. జూన్ 17 నుంచి టెస్టు మ్యాచ్ లలో, జూలై 10 నుంచి టీ20ల్లో అమలు కానున్నాయి.