Tuesday, June 24, 2025
HomeఆటRishabh Pant: రిషభ్ పంత్‌ పై ఐసీసీ చర్యలు.. డిమెరిట్ పాయింట్

Rishabh Pant: రిషభ్ పంత్‌ పై ఐసీసీ చర్యలు.. డిమెరిట్ పాయింట్


ICC punishes Rishabh Pant: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు 61వ ఓవర్ సమయంలో బాల్ పాతది అయిందని మార్చాలని పంత్ అంపైర్ తో చర్చించాడు. అయితే బంతిని పరిశీలించిన అంపైర్ బాల్ మార్చేందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన పంత్ బంతిని నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అయింది.

పంత్ ఇలా చేయడం అంపైర్ల నిర్ణయాన్ని ధిక్కరించడం కిందకు వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో ఆన్-ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు. రిఫరీ ఈ వీడియో పరిశీలించి ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ను పంత్ ఉల్లంఘించినట్లు తేల్చారు. అనంతరం ఐసీసీ పంత్ ను మందలించడంతో పాటు డిమెరిట్ పాయింట్ విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం లెవెల్ 1 ఉల్లంఘనలకు మందలింపుతో పాటు ఆటగాడి మ్యాచ్ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం కోత విధించవచ్చు. లేదంటే ఒకటి, రెండు డిమెరిట్ పాయింట్లను ఆటగాడి ఖాతాలో కూడా కేటాయించవచ్చు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచులో పంత్ తన బ్యాటింగ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులతో రెచ్చిపోయిన రిషభ్.. రెండో ఇన్నింగ్స్ లోనూ 118 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే టెస్టు రెండు ఇన్నింగుల్లో సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్ గా నిలిచాడు. అంతకుముందు జింబాబ్వే దిగ్గజ ఆటగాడు ఆండీ ఫ్లవర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News