IND vs Eng 1st Test: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 90/2 పరుగుల స్కోర్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి 153/3 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(71), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(31) పరుగులతో ఉన్నారు.
నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే కెప్టెన్ శుభమన్ గిల్ వికెట్ పారేసుకున్నాడు. కార్స్ వేసిన తొలి ఓవర్ లో చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ అద్భుతమైన సెంచరీతో రాణించిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను నిలకడగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్లారు. నాలుగో వికెట్ కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
లంచ్ బ్రేక్ తర్వాత ఇదే ఆటతీరును కొనసాగిస్తూ ఆధిక్యం పెంచుకుంటూ మ్యాచులో టీమిండియా పట్టు సాధించవచ్చు. ఇక 8 సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ కు మంచి అవకాశం దొరికింది. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన కరుణ్.. రెండో ఇన్నింగ్స్ లో అయినా భారీ పరుగులు చేసి సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. లేని పక్షంలో జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ధాటి ఆడిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా రాణించండంతో 465 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లతో రాణించారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయిన విషయం విధితమే. యశస్వి జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలతో అదరగొట్టారు.