IND vs ENG Second Test Match Highlights: ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గిల్ సేన ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలి టెస్టు మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత జట్టు..సిరీస్ ను 1-1తో సమానం చేసింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కెప్టెన్ శుబ్మన్ గిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టెస్ట్ జూలై 10న లార్డ్స్ లో జరగనుంది.
గిల్ డబుల్ సెంచరీ
ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు పరుగులే చేసి ఔటయ్యాడు. మరో ఎండలో. కరణ్ నాయర్ సహకారంతో యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. వీరద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో కరుణ్(31) పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత జైస్వాల్ కు జత కలిసిన గిల్ తొలుత ఆచితూచి ఆడాడు. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో యశస్వి తృటిలో సెంచరీ మిస్ చేసుకుని పెవిలియన్ బాట పట్టాడు. మరోవైపు గిల్ పంత్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. పంత్, రెడ్డి తక్కువ స్కోర్లుకే వెనుదిరిగినా..జడేజా అండతో రెచ్చిపోయిన గిల్ డబుల్ సెంచరీ(269) సాధించాడు. జడేజా కూడా 89 పరుగులతో సత్తా చాటాడు. వాషింగటన్ సుందర్(42) కూడా రాణించడంతో టీమిండియా 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీశాడు.
బ్రూక్, స్మిత్ సెంచరీలు.. చెలరేగిన సిరాజ్
తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జోరూట్, హ్యారీ బ్రూక్ వికెట్లు పడకుండా ఆడ్డుకున్నారు. అయితే 22 పరుగులు చేసిన రూట్ ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చి పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ స్టోక్స్ డకౌట్ అయ్యాడు. అయితే బ్రూక్ కు జతకలిసిన జేమీ స్మిత్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. స్వల్పస్కోరుకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..వీరిద్దరి పోరాటంతో 407 పరుగులకు ఆలౌటైంది. స్మిత్, బ్రూక్ సెంచరీలు చేశారు. సిరాజ్ ఆరు వికెట్లుతో చెలరేగాడు.
గిల్ మరోసారి..
180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మెుదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ శుభారంభాన్నిచ్చారు. ఈ క్రమంలో రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. 126 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను మరోసారి గిల్ ఆదుకున్నాడు. పంత్ తో కలిసి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. వీరిద్దరూ వన్డే మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్(161) సెంచరీ, పంత్(65) హాఫ్ సెంచరీ పూర్త చేసుకున్నారు. పంత్ ఔటైనా గిల్ జోరు తగ్గలేదు. జడేజా(69)తో కలిసి మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ 427 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
ఇది కూడా చదవండి: Shubman Gill – కొత్త కెప్టెన్ రికార్డుల మోత.. సెంచరీలే సెంచరీలు!
చుక్కలు చూపించిన ఆకాశ్ దీప్
600లకు పైగా టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ఏ దశలోనూ విజయం దిశగా వెళ్లలేదు. భారత యువ కెరటం ఆకాష్ దీప్ ఇంగ్లీష్ బ్యాటర్లుకు చుక్కలు చూపించాడు. అతడు నిప్పుల్లాంటి బంతులకు ఇంగ్లీష్ బ్యాటర్ల దక్గర సమాధానం లేకుండా పోయింది. జేమీ స్మిత్ 88 పరుగులతో పోరాటం చేసినా.. భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ 271 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆకాశ్ దీప్ ఆరు వికెట్లతో చెలరేగి అతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో ఎడ్జ్బాస్టన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. కెప్టెన్ గా గిల్ కు ఇదే తొలి విజయం.