IND vs ENG Test Series: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 248/4 పరుగులు చేసింది. ఇంకా 139 పరుగుల వెనుకంజలో ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 145/3 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టుకు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మంచి శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా పంత్ అయితే తనదైన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ నమోదు చేశాడు.
రాహుల్, పంత్ నాలుగో వికెట్కు 141 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. అయితే దురదృష్టవశాత్తు లంచ్ బ్రేక్కు ముందు రిషభ్ పంత్ అనవసరమైన పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ అద్భుతంగా బంతిని వికెట్లకు విసిరి రనౌట్ చేశాడు. దీంతో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక కేఎల్ రాహుల్ 171 బంతుల్లో 13 ఫోర్లు కొట్టి 98 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. సెంచరీకి మరో రెండు పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. పంత్ 74 పరుగులతో పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అర్చర్, స్టోక్స్, వోక్స్ తలా ఓ వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ ఆటగాడు జో రూట్ (104) పరుగులతో అదరగొట్టాడు. తన కెరీర్లో 37వ శతకంతో రికార్డ్ సృష్టించాడు. జామీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) కూడా అర్ధసెంచరీలతో రాణించాడరు. భారత బౌలర్లలో జస్ప్రీల్ బుమ్రా ఐదు వికెట్లతో మరోసారి దుమ్మురేపగా.. నితీశ్ కుమార్, మహ్మద్ సిరాజ్ చెరో రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశాడు.
Also Read: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన శుభమన్ గిల్
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టిమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. యశిస్వి జెస్వాల్ ఆర్చర్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన కరుణ్ నాయర్ 40 పరుగులతో మంచి ఫామ్లో కనిపించాడు. అయితే రూట్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 145/3 పరుగులు చేసింది.


