IND vs PAK U19 Live Score Updates: అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న కీలక పోరులో భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. ఒకే బంతికి రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. ఆ తర్వాతి బంతికే వికెట్ సమర్పించుకుని పెవిలియన్ చేరాడు. అతను 22 బంతుల్లో 30 పరుగులు చేసి మహ్మద్ సయ్యమ్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఒకే బంతికి రెండు ఛాన్సులు!
ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఒక వింత సంఘటన జరిగింది. మహమ్మద్ సయ్యమ్ వేసిన బంతిని వైభవ్ పుల్ షాట్ ఆడబోయి గాలిలోకి లేపాడు. మెుదట స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ హుజైఫా అహ్సాన్ సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. అప్పటికే వైభవ్ క్రీజు మధ్యలోకి వచ్చేశాడు. క్యాచ్ మిస్ చేసిన ఫీల్డర్ వెంటనే బంతిని కీపర్ వైపు విసిరాడు. బంతి స్టంప్స్కు తగలకుండా పక్కకు వెళ్ళింది. వెనుక ఉన్న ఫీల్డర్ కూడా బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో రనౌట్ గండం నుంచి కూడా వైభవ్ తప్పించుకున్నాడు. కానీ.. ఈ అదృష్టం ఎంతో సేపు నిలవలేదు. సరిగ్గా ఆ తర్వాతి బంతికే వైభవ్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. లభించిన గోల్డెన్ ఛాన్స్ను భారీ స్కోరుగా మలచలేకపోయినందుకు వైభవ్ తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు.
నెటిజన్ల ఆగ్రహం
చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించిన వైభవ్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “అతనికి అద్భుతమైన టాలెంట్ ఉంది, కానీ మ్యాచ్ పరిస్థితిని బట్టి ఆడే అవగాహన ఇంకా రావాలి” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ వంటి పెద్ద జట్లపై పదేపదే విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: T20 World Cup 2026 -టీ20 వరల్డ్ కప్కు నిపా వైరస్ ముప్పు ఉందా? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
భారత్ సెమీఫైనల్ చేరాలంటే?
పాకిస్థాన్తో జరుగుతున్న ఈ మ్యాచ్ సెమీస్ బెర్తును నిర్ణయించనుంది. ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్ సెమీస్ చేరడం దాదాపు ఖాయమే అయినా, సమీకరణాలు ఇలా ఉన్నాయి. నేరుగా గెలిస్తే ఎటువంటి లెక్కలతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ చేరుతుంది. భారత్ ఓడిపోయినా రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉంది. పాకిస్థాన్ ఈ లక్ష్యాన్ని 31.5 ఓవర్లలోపు (ఒకవేళ టార్గెట్ 250 అయితే 33.2 ఓవర్లలోపు) ఛేదించకుండా భారత్ అడ్డుకోవాలి. అలా చేస్తే పాక్ కంటే మెరుగైన రన్ రేట్తో భారత్ సెమీస్ వెళ్తుంది.

