Indian Team Creates History: టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వాంఖడే స్టేడియంలో అమెరికాపై సాధించిన విజయం కేవలం ఒక మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను అందుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ ‘వరల్డ్ రికార్డ్’ నెలకొల్పింది.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రికార్డులు బద్దలు
2024 టీ20 ప్రపంచకప్లో ఓటమి అనేది లేకుండా వరుసగా 8 మ్యాచ్లు గెలిచి ఛాంపియన్గా నిలిచిన భారత్.. ఇప్పుడు 2026 టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికాను ఓడించడంతో తన విజయాల పరంపరను 9వ మ్యాచ్కు చేర్చింది. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు వరుసగా 8 విజయాలతో అగ్రస్థానంలో ఉండేవి. తాజా గెలుపుతో ఆ రెండు జట్లను వెనక్కి నెట్టి భారత్ ఇప్పుడు విశ్వవేదికపై అగ్రస్థానంలో నిలిచింది.
ఒక్కడే పోరాడాడు.. జట్టును గెలిపించాడు..
ఈ చారిత్రక రికార్డు వెనుక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం ఉంది. వాంఖడే పిచ్పై అమెరికా బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే, భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. భారత్ ఒకానొక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. కానీ, కెప్టెన్ సూర్య (49 బంతుల్లో 84*) పట్టుదలతో ఆడి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు. సూర్య తప్ప మరే ఇతర బ్యాటర్ 30 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడం గమనార్హం.
Also Read: Suryakumar Yadav -కింగ్ రికార్డును బద్దలుకొట్టిన స్కై.. టీ20ల్లో సూర్య సరికొత్త చరిత్ర!
నమీబియాతో పోరు
ఈ చారిత్రక విజయంతో గ్రూప్ టేబుల్లో అగ్రస్థానానికి చేరిన భారత్, ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడనుంది. ఆ తర్వాత కొలంబోలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో, అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో తలపడాల్సి ఉంది. పవర్ప్లేలో బ్యాటింగ్ సమస్యలు వేధిస్తున్నప్పటికీ, బౌలింగ్లో సిరాజ్, అర్ష్దీప్ ఫామ్ జట్టుకు కొండంత బలాన్నిస్తోంది.

