ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఫైట్ దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ పోరులో విజేతగా నిలవాలని ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని రోహిత్ సేన భావిస్తుంటే.. రెండోసారి కప్పు కొట్టాలని కివీస్ కలలు కంటోంది. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన జట్టుపై కాలుల వర్షం కురవనుంది. ఇంతకీ ఫైనల్ పోరులో గెలిచిన జట్టుకు ఎన్ని కోట్లు వస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్ పోరులో టీమిండియా గెలిచి.. ఛాంపియన్స్ గా నిలిస్తే రూ.19.45 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. మరోవైపు ఈ పోరులో ఓడిన జట్టుకు రూ.9.72 కోట్లు లభించనుంది. ఈ క్రమంలో విజేతగా నిలవడంతో పాటు భారీ ప్రైజ్ మనీ భారత్ సొంతం చేసుకోవాలని టీమిండియా అభిమానులు కోరుతున్నారు. 2000 సంవత్సరంలో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ ను ఓడించి న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరోసారి కివీస్ ఈ టోర్నీ విజేతగా నిలవలేదు. కాగా.. నాటి ఫైనల్ మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈటోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగానే జరిగాయి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా నాలుగింటిలో గెలిచింది. గ్రూప్ స్టేజీలో న్యూజిలాండ్ పై కూడా భారత్ విజయం సాధించింది. అయితే.. ఫైనల్ మ్యాచ్ లో కివీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది.