ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం.. దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్కు చేరుకున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయితే.. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానంతో సెమీస్ కి వెళ్లనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ ను రెండు జట్లు సీరియస్ గా తీసుకున్నాయి. ప్రస్తుతం గ్రూప్-A పాయింట్ల పట్టికలో భారత్-న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్ల ఖాతాలో సమానంగా పాయింట్లు ఉన్నాయి.
అయితే టీమిండియా (+0.647) నెట్ రన్రేట్ కంటే న్యూజిలాండ్ (+0.863) నెట్రన్రేట్ ఎక్కువగా ఉండడంతో. ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది. ఆదివారం కివీస్ పై భారత్ గెలిస్తే 6 పాయింట్లు భారత్ ఖాతాలో చేరుతాయి. అప్పుడు అగ్రస్థానంతో భారత్ సెమీస్లో అడుగుపెడుతుంది.
హెడ్ టూ హెడ్: వన్డేల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకూ 118 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 60 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా, 50 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచింది. 7 మ్యాచ్లు రద్దు అయ్యాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఈ రెండు జట్లు కేవలం ఒక్క సారి మాత్రమే ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో కివీస్ గెలుపొందింది. ఇక ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్ లు 11 సందర్భాల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 5 మ్యాచ్ల్లో భారత్, కివీస్ గెలిచాయి. ఓ మ్యాచ్లో ఫలితం రాలేదు.
ఇక ఇటీవల ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచులు పరిశీలిస్తే.. చివరి 5 వన్డే మ్యాచ్ల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. 5 మ్యాచ్ల్లోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. ఇది ఆదివారం న్యూజిలాండ్ తో తలపడబోయే ముందు భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అయితే ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఎంత ప్రమాదకరమైన జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త ఏమరపాటుగా ఉన్న భారత్కు షాక్ తప్పదు. అందుకే ఈ మ్యాచ్ ను రోహిత్ సేన చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసంతో సెమీస్ కు వెళ్తుంది అనడంలో సందేహం లేదు.