ఇండియాలో క్రికెట్ ప్రేమికులకు.. ఐపీఎల్ (IPL) అంటే ఓ వేడుక. భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది క్రీడాకారులు ఐపీఎల్ కోసం ఎదురు చూస్తుంటారు. 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ.. ఇప్పటి వరకూ 17 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ ఏడాది 18వ సీజన్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. ఇక మే 25న ఫైనల్ ఫైట్ జరగనుంది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే IPL 2025 సీజన్ షెడ్యూల్ను మరో వారం రోజుల్లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఓ నివేదిక ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. మే 25న ఈ మ్యాచ్ జరగనున్నట్లు పేర్కొంది. దీనితో పాటు ప్లేఆఫ్ 2 మ్యాచ్ కూడా కోల్కతానే వేదిక కానుందట. ఇక ప్లేఆఫ్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ ల విషయానికి వస్తే అవి హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరగనున్నాయని తెలుస్తోంది.
ఇక ప్రతి సంవత్సరం సగం మ్యాచులు సొంత మైదానంలో.. మిగిలిన మ్యాచులు ప్రతర్థి మైదానాల్లో ఆడతారు. అయితే ఈ సారి మాత్రం రెండు జట్లు రాజస్థాన్, ఢిల్లీ లు తమ హోమ్ మ్యాచ్లను తమ స్వంత మైదానాలతో పాటు మరొక మైదానంలోనూ ఆడనున్నాయట. రాజస్థాన్ హోం గ్రౌండ్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం. ఈ మైదానంలో ఐదు మ్యాచ్లు, అస్సాంలోని బర్సపారా క్రికెట్ (ACA) స్టేడియంలో రెండు మ్యాచ్లను ఆర్ఆర్ ఆడనుంది. అటు ఢిల్లీ తమ హోమ్ గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ మైదానంలో ఐదు మ్యాచ్లు ఆడనుండగా వైజాగ్లోని ACA-VDCA స్టేడియంలో రెండు మ్యాచ్లు ఆడనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ లో.. మొత్తం పది జట్లు పోటీపడనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్.. జట్లు తలపడతాయి. గత సీజన్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది. కేకేఆర్ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించి మూడవ టైటిల్ను గెలుచుకుంది.