ఐపీఎల్ 2025 సీజన్ ఎన్నో మలుపులు తిరుగుతూ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఈ నాలుగు జట్లు లీగ్ దశను విజయవంతంగా ముగించి టాప్ 4లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, బెంగళూరు జట్లు ఇవాళ క్వాలిఫయర్ 1లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ముల్లాన్పుర్ వేదికగా ప్రారంభం కానుంది.
ఈ సీజన్లో లీగ్ దశ ముగిసేసరికి పంజాబ్, బెంగళూరు జట్లు ఒక్కోటి తొమ్మిది విజయాలతో సమంగా నిలిచినా, నెట్ రన్ రేట్ విషయంలో పంజాబ్ కొద్దిగా పైచేయిగా ఉండడంతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పంజాబ్ నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. అయితే తాజా వాతావరణ సమాచారం ప్రకారం మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇక ముల్లాన్ పుర్ పిచ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అక్కడ జరిగిన నాలుగు మ్యాచ్లలో మొదటి రెండు వందలకుపైగా స్కోర్లు నమోదవగా, తరువాతి రెండు మ్యాచ్లలో తక్కువ స్కోర్లు నమోదు కావడంతో ఈరోజు పిచ్ ఎలా స్పందిస్తుందో అనేదే ఆసక్తికర అంశంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్, బెంగళూరు జట్లు ఇప్పటివరకు 35సార్లు ఢీకొన్నాయి. ఇందులో పంజాబ్ 18 విజయాలు సాధించగా, బెంగళూరు 17 విజయాలు సాధించింది. 2025 సీజన్లో ఈ జట్లు ఒకదానిని ఒకటి ఓడించుకోవడంతో నేటి మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశముంది.
బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో సమతుల్యంగా కనిపిస్తుండగా.. పంజాబ్ బౌలింగ్ యూనిట్ కొంత నిరుత్సాహంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే టోర్నమెంట్ గెలవాలంటే ఒకే ఒక్క మ్యాచ్ చాలు అన్న నమ్మకంతో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. నేటి క్వాలిఫయర్ విజేత నేరుగా ఫైనల్కు చేరుతుండగా, ఓడిన జట్టుకు ఎలిమినేటర్ విజేతతో మరో అవకాశం లభించనుంది. ఐపీఎల్ 2025 ఫైనల్కు తొలి అడుగు వేసే జట్టు ఎక్కడి నుంచి వచ్చిందో మరికొన్ని గంటల్లో తేలనుంది.