ఐపీఎల్ 2025 సీజన్ తుది దశకు చేరుకుంది. టోర్నీలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్(PBKS vs MI) జట్ల మధ్య కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్లో గెలుపొందాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై విజయంతో ముంబై ఉత్సాహంగా ఉండగా, క్వాలిఫయర్ -1లో బెంగళూరు చేతిలో ఘోర ఓటమితో పంజాబ్ డీలా పడింది. ఈ నేపథ్యంలో టేబుల్ టాపర్గా నిలిచిన పంజాబ్ ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్లో బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ముంబై కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించి ఆరోసారి కప్ కొట్టాలని భావిస్తోంది.
ఇక అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్కు గొప్ప రికార్డు ఉంది. ఇక్కడ ఆ జట్టు ఆరు మ్యాచ్లు ఆడగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇదే స్టేడియంలో ముంబై ఆరు మ్యాచ్లు ఆడగా ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. దీంతో ముంబైను స్టేడియం ఫోబియా వెంటాడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దైతే టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ జట్టు ఫైనల్ చేరుతుంది.