భారత క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే పండుగ. దాదాపు రెండు నెలలు జరిగే ఈ ఐపీఎల్ సందడి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఐపీఎల్ 2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ సీజన్లో బీసీసీఐ మూడు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.
సలైవాపై బ్యాన్ రద్దు: బౌలర్లు బంతికి సలైవా (ఉమ్మి) రుద్దడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. ఈ మేరకు ఉన్నతాధికారి ఈ నిర్ణయంపై మెజారిటీ కెప్టెన్లు సానుకూలంగా స్పందించారని చెప్పారు. కరోనా సమయంలో ముందు జాగ్రత్త చర్యగా ఐసీసీ ఈ నిషేధాన్ని అమలు చేసింది. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
రెండో ఇన్నింగ్స్లో రెండో బాల్: రెండో ఇన్నింగ్స్ కోసం రెండో బంతి అనే కొత్త నియమాన్ని తీసుకొచ్చారు. ముంబైలో జరిగిన కెప్టెన్ల, మేనేజర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 11వ ఓవర్ అనంతరం రెండో బాల్ను తీసుకునే అవకాశం ఉంటుంది. రాత్రుళ్లు జరిగే ఈ మ్యాచ్పై పడే మంచు బిందువుల ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం రెండో బాల్ను వాడుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ఆ బాల్ మార్పు విషయాన్ని బీసీసీఐ అంపైర్ల అభీష్టానికి వదిలివేసింది. బంతిని మార్చాలా వద్దా అన్న విషయంపై అంపైర్లు నిర్ణయించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో జరిగే మ్యాచ్లలో రెండవ బంతిని ఉపయోగించే ఛాన్స్ లేదు.
వైడ్లకు కూడా డీఆర్ఎస్: మూడో, డీఆర్ఎస్ ఉపయోగంలో మార్పులు వచ్చాయి. హైట్ వైడ్స్, ఆఫ్ సైడ్ వైడ్స్ కోసం కూడా ఇప్పుడు డిఆర్ఎస్ వాడుకోవచ్చు. అయితే, లెగ్-సైడ్ వైడ్స్ కోసం మాత్రం డీఆర్ఎస్ను ఉపయోగించే అవకాశం లేదు. ఇది ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ను గతేడాదిలాగే కొనసాగించాలి. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లపై నిషేధం వంటివి ఉండవు.