GT vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండోసారి ఓటమి పాలైంది. ఆదివారం సాయంత్రం గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది. 163 పరుగులకే ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన గుజరాత్.. ఆ టార్గెట్ను 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-kkr-beat-sunrisers-hyderabad-by-7-wickets/
ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్కి దిగింది. జీటీ కట్టుదిట్టమైన బౌలింగ్తో భారీ పరుగులను రాబట్టడంలో శ్రేయాస్ అయ్యర్ సేన విఫలమైంది. టాప్ ఆర్డర్ విఫలం కాగా.. సూర్యాంశ్ షెడ్గే 57(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మార్కస్ స్టోయినస్ 40(31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. ప్రభ్సిమ్రన్ సింగ్ (15), శ్రేయాస్ అయ్యర్ (19), మార్కో జాన్సేన్ (20) పరుగులు చేశారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో జోసన్ హోల్డర్ 4 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, రబాడ తలో 2 వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.
164 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్కి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలో ఎక్కడా తడబడలేదు. అయితే క్రీజులో ఉన్న జోస్ బట్లర్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఒకానొక సమయంలో మ్యాచ్ పంజాబ్ వైపే మళ్లిందా అనే అంచనాల నడుమ బౌండరీలతో మళ్లీ గుజరాత్ వైపు మళ్లించారు. దీంతో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(5) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 57(41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక జోస్ బట్లర్ 26 పరుగులు చేసి సాయి సుదర్శన్తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వాషింగ్టన్ సుందర్ 40(23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులతో అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. నిషాంత్ సింధు (15), జాసన్ హోల్డర్ (5), అర్షద్ ఖాన్(8) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాక్ 2, అర్షదీప్ సింగ్ 2, మార్కో జాన్సేన్, స్టోయిన్స్ తలో వికెట్ పడగొట్టారు.

