Tuesday, September 17, 2024
HomeఆటBAN vs IND: బంగ్లా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డ ఇషాన్‌, కోహ్లీ.. టీమిండియా భారీ స్కోర్‌

BAN vs IND: బంగ్లా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డ ఇషాన్‌, కోహ్లీ.. టీమిండియా భారీ స్కోర్‌

BAN vs IND: బ‌ంగ్లాదేశ్‌తో మూడో వ‌న్డేలో భార‌త్ బ్యాట్స్‌మెన్లు వీర‌విహారం చేశారు. గ్రౌండ్ న‌లువైపుల సిక్సులు, ఫోర్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీతో బంగ్లా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించ‌గా.. సెంచ‌రీతో కోహ్లీ ఊచ‌కోత‌కోశాడు. ఫ‌లితంగా టీమిండియా 50 ఓవ‌ర్ల‌కు ఎనిమిది వికెట్లు కోల్పోయి 409తో బంగ్లా జ‌ట్టుకు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. త‌ద్వారా వ‌న్డేల్లో అత్య‌ధికసార్లు 400కిపైగా ప‌రుగులు చేసిన జ‌ట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. టీమిండియా వ‌న్డేల్లో 400 పైగా ర‌న్స్ చేయ‌డం ఇది ఆరోసారి. మ‌రోవైపు ఇషాన్ కిష‌న్ అతి త‌క్కువ బంతుల్లో డుబుల్ సెంచ‌రీతో స‌రికొత్త రికార్డు న‌మోదు చేశాడు.

- Advertisement -

బంగ్లాదేశ్‌తో వ‌న్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన భార‌త్ సిరీస్‌ను కోల్పోయింది. చివ‌రి మ్యాచ్ ఇవాళ ఆడింది. ఛ‌త్‌గ్రామ్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జ‌ట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ స్థానంలో ఇషాన్ కిష‌న్ ధావ‌న్‌తో క‌లిసి క్రిజ్‌లోకి వ‌చ్చాడు. అయితే, కొద్దిసేప‌టికే శిఖ‌ర్ ధావ‌న్(3) రూపంలో భార‌త్ వికెట్ కోల్పోయింది. ఆ త‌రువాత క్రిజ్‌లోకి వ‌చ్చిన కోహ్లీతో క‌లిసి ఇషాన్ కిష‌న్ ప‌రుగుల వ‌ర‌ద‌ను ప్రారంభించారు. ఒక‌వైపు కోహ్లీ సింగిల్స్‌తో ఇషాన్‌కు స్టైక్ ఇస్తుండ‌గా.. ఇషాన్‌ బంగ్లా బౌల‌ర్ల‌పై వీర‌విహారం చేశాడు. 85 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. మ‌రో సెంచ‌రీని కేవ‌లం 40 బంతుల్లోనే పూర్తిచేసి 126 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇషాన్‌ డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డం ఇదే తొలిసారి. మ‌రోవైపు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అతి త‌క్కువ బంతుల‌కే డ‌బుల్ సెంచ‌రీ చేసిన బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ త‌రువాత 210 (24ఫోన్లు, 10 సిక్స్‌లు) ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3) పెవిలియన్ చేరారు. రాహుల్ క్రిజ్‌లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో దూకుడు పెంచిన విరాట్ కోహ్లీ.. శ‌త‌కం పూర్తిచేసుకున్నాడు. కోహ్లీకి వ‌న్డేల్లో ఇది 44వ సెంచ‌రీ. ఎబాదత్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. 91 బంతుల్లో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుస బంతుల్లో రాహుల్, కోహ్లి ఔట్ కావడంతో భారత్ 41.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కోహ్లి ఔటైన తర్వాత వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్కోర్ బోర్డ్‌ను ముందుకు నడిపించారు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించిన తర్వాత అక్షర్ (17 బంతుల్లో 20) ఔటయ్యాడు. షకీబ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (27 బంతుల్లో 37) ఔటయ్యాడు. అప్పటికే జట్టు స్కోర్ 400 దాటింది. చివరి ఓవర్లో శార్దుల్ ఠాకూర్ ఔట్ కాగా.. భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. బంగ్లాదేేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్, షకీబ్ అల్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News