Mohammed Siraj rare feat in the IPL: ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్, హైదరాబాద్కు చెందిన ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తన కెరీర్లో ఓ అరుదైన ఫీట్ అందుకున్నాడు. శనివారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి.. టీ20 ఫార్మాట్లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కెప్టెన్ అజింక్యా రహానెను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సిరాజ్ విసిరిన అద్భుతమైన ఇన్స్వింగర్ బాల్ను ఎదుర్కోలేక రహానె (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్తో టీ20ల్లో 200 వికెట్లు తీసిన 21వ భారత బౌలర్గా సిరాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన 174వ టీ20 మ్యాచ్లో ఈ మైలురాయిని చేరుకున్న సిరాజ్.. ఐపీఎల్ అన్ని సీజనల్లో కలిపి ఇప్పటివరకు 121 మ్యాచ్లలో 123 వికెట్లు పడగొట్టాడు.
ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్..
అయితే, సిరాజ్ వ్యక్తిగత రికార్డు సాధించిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (93) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లు బాది గుజరాత్ ముందు బారీ లక్ష్యాన్ని నెలకొల్పాడు. ఫిన్ అలెన్కి అండగా అంగ్క్రిష్ రఘువంశీ (82 నాటౌట్), కామెరాన్ గ్రీన్ (52 నాటౌట్) నిలిచి మెరుపు అర్ధశతకాలతో చెలరేగిపోయారు. గుజరాత్ ఫీల్డర్లు రెండు సార్లు క్యాచ్లు మిస్ చేయడంతో అలెన్ మరింతగా రెచ్చిపోయాడు. రహానె ఔటయ్యాక, అలెన్-రఘువంశీ రెండో వికెట్కు 95 పరుగులు చేయగా, ఆ తర్వాత రఘువంశీ గ్రీన్ ధ్వయం అజేయంగా మూడో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కేకేఆర్కు భారీ స్కోరును అందించింది. దీంతో, గుజరాత్పై 29 పరుగుల తేడాతో కోల్కతా భారీ విజయాన్ని నమోదు చేసింది.

