ఐపీఎల్ 2025 సీజన్లో మరోసారి టైటిల్ కోసం పోటీ పడుతున్న ముంబై ఇండియన్స్, కేవలం రెండు విజయాల దూరంలో నిలిచింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ను ఎలిమినేటర్లో ఓడించి దూసుకొచ్చిన ముంబై, ఇప్పుడు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ కీలక మ్యాచ్ ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా.. ముంబై గత రికార్డులు జట్టు అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.
ముంబై ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు క్వాలిఫయర్-2 మ్యాచ్లు ఆడింది. అందులో రెండు సార్లు విజయం సాధించింది. ఆ రెండు విజయాల్లోనూ ముంబై జట్టు ఫైనల్కు వెళ్లి టైటిల్ను కూడా గెలుచుకోవడం విశేషం. అయితే మిగిలిన రెండు సార్లు మాత్రం క్వాలిఫయర్-2 అడ్డంకిగా మారింది. గమనించదగ్గ విషయమేమంటే, ఆ రెండు ఓటములనూ ఎలిమినేటర్ గెలిచి వచ్చిన సీజన్లలోనే ముంబై ఎదుర్కొంది.
2011లో ముంబై మొదటిసారిగా క్వాలిఫయర్-2 ఆడి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఆ ఏడాది ముంబై ఎలిమినేటర్ గెలిచి వచ్చింది. ఇక 2013లో క్వాలిఫయర్-1లో ఓటమి తర్వాత, మళ్లీ రాజస్థాన్ను క్వాలిఫయర్-2లో ఓడించి ఫైనల్కు చేరింది. అక్కడ సీఎస్కేపై గెలిచి టైటిల్ను దక్కించుకుంది.
అలాగే, 2017లోనూ క్వాలిఫయర్-1లో ఓడిన ముంబై, తరువాత క్వాలిఫయర్-2లో కోల్కతాను ఓడించి ఫైనల్కు చేరింది. చివరికి రైజింగ్ పూణెపై విజయం సాధించి మరో ట్రోఫీని ముద్దాడింది. అయితే, 2023లో ఎలిమినేటర్లో గెలిచి వచ్చిన ముంబై, క్వాలిఫయర్-2లో గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పుడు 2025లో కూడా ముంబై అదే విధంగా ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫయర్-2కి వచ్చింది. ఇక ఈసారి గతాన్ని పునరావృతం చేస్తుందా? లేక టైటిల్ దిశగా దూసుకుపోతుందా? అన్నది ఆసక్తికర ప్రశ్న.
ఇక పంజాబ్ కింగ్స్తో ముంబై హెడ్ టు హెడ్ రికార్డ్స్ ని ఒకసారి పరిశీలిస్తే, ఇప్పటి వరకు ఈరెండు జట్లు 32 మ్యాచ్లు ఆడారు. అందులో ముంబై ఆధిక్యంలో ఉంది – 17 విజయాలు సాధించగా, పంజాబ్ 15 విజయాలతో దగ్గరదగ్గర గానే పోటీ ఇచ్చింది. కాబట్టి ఈ క్వాలిఫయర్-2 పోరు అత్యంత హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.