Retirement news on Nathan Lyon: ఆస్ట్రేలియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ తన అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తుపై స్పందించారు. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికే ముందు భారత్, ఇంగ్లండ్లలో టెస్ట్ సిరీస్లు గెలవాలనేది తన చిరకాల కోరిక అని లియాన్ వెల్లడించారు. 37 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇప్పటివరకు 138 టెస్టుల్లో 556 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరిగా నిలిచారు.
నాథన్ లియాన్ భారత్తో 32 టెస్టు మ్యాచ్లలో 130 వికెట్లు తీశారు. అయితే, భారత్లో టెస్ట్ సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ఆయన భాగం కాలేదు. 2004-05 సీజన్ తర్వాత ఆస్ట్రేలియా భారత్లో టెస్ట్ సిరీస్ గెలవలేదు. “భారత్లో గెలవాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఇంగ్లండ్లో కూడా గెలవాలనుకుంటున్నాను” అని లియాన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సిరీస్లను గెలుచుకునే అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. దీనిపై లియాన్ మాట్లాడుతూ, “ఈ సమయంలో మా దృష్టి వెస్టిండీస్ పర్యటనపైనే ఉంది. వెస్టిండీస్లో మేము ప్రతిదీ సరిగ్గా చేశామని నిర్ధారించుకోవాలనుకుంటున్నాము” అని పేర్కొన్నారు. రాబోయే యాషెస్ సిరీస్, మరో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ఆడాలని కూడా తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించిన అనంతరం ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్లో టీమ్ గీతాన్ని ఆలపించిన అలెక్స్ కారీకి నాథన్ లియాన్ ఈ బాధ్యతను అప్పగించారు. ప్రతి విజయం తర్వాత ఆస్ట్రేలియన్ జట్టు ‘అండర్నీత్ ద సదరన్ క్రాస్’ పాటను పాడుతుంది. ఈ సంప్రదాయాన్ని దివంగత రాడ్ మార్స్ ప్రారంభించారు. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ మైక్ హస్సీ నుంచి లియాన్ ఈ బాధ్యతను స్వీకరించారు. “నేను 12 సంవత్సరాలుగా ఈ పని చేశాను, ఇది నా కెరీర్లో అతిపెద్ద హైలైట్లలో ఒకటి. నేను త్వరలో పదవీ విరమణ చేయబోతున్నానని దీని అర్థం కాదు” అని ఆయన స్పష్టం చేశారు.
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 159 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం నుంచి ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ను 2-0తో కైవసం చేసుకోవాలని కంగారూ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.