WPL 2026: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా.. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్, రెండుసార్లు WPL విజేత అయిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కి దిగుతోంది. కాగా, ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా.. ముంబై నాలుగు మ్యాచుల్లో, ఆర్సీబీ మూడు మ్యాచుల్లో గెలుపొందాయి. గత సీజన్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో టైటిల్ను గెలుచుకుంది.
అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం..
టాస్ గెలిచిన అనంతరం మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన.. ఈ మైదానంలో రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపింది. జట్టులో అమ్మాయిలంతా బాగా కలిసిపోయారని.. యువ జట్టుకు విదేశీ ప్లేయర్లు కూడా త్వరగా అలవాటు పడ్డారని వెల్లడించింది. గ్రేస్ హారిస్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, నదీన్ డి క్లర్క్ ఈ మ్యాచ్లో ఆడుతున్నారని.. సీజన్ను ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని పేర్కొంది.
బౌలింగ్ తీసుకునేవాళ్లం:
కాగా, టాస్ గెలిచి ఉంటే తాము కూడా బౌలింగే తీసుకోవాలనుకున్నామని ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత 10 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నామని.. ఇది సీజన్లో మొదటి గేమ్ కాబట్టి, ఫలితం ఎలా ఉంటుందో చూద్దామని పేర్కొంది. కీలక ఆల్రౌండర్ హేలీ మాథ్యూస్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్కు దూరమైనట్లు తెలిపిన హర్మన్.. ఆమె స్థానంలో నాట్ సీవర్-బ్రంట్తో కలిసి జి.కమలిని ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందని వివరించింది.
Also Read: https://teluguprabha.net/sports-news/bcci-action-on-bangladesh-cricketers/
ఫైనల్ జట్లు ప్లేయింగ్- 11:
ముంబై ఇండియన్స్: నాట్ సీవర్-బ్రంట్, జి. కమలిని (వికెట్ కీపర్), అమేలియా కెర్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమన్జోత్ కౌర్, నికోలా క్యారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నదీన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.

