Friday, October 18, 2024
HomeఆటOlympics to start from tomorrow: రేపటి నుంచే ప్యారిస్ ఒలింపిక్స్

Olympics to start from tomorrow: రేపటి నుంచే ప్యారిస్ ఒలింపిక్స్

329 గోల్డ్ మెడల్స్ కోసం 206 దేశాలు, 10,714 అథ్లెట్లు

ప్ర‌పంచ క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న క్రీడా సంరంభం మ‌రో 24 గంట‌ల్లో ప్రారంభం కానుంది. ఎంతో ఉద్వేగంతో… ఉత్సాహంతో… క్రీడా స్ఫూర్తితో… పోరాట ప‌టిమ‌తో…విభిన్న విభాగాల్లో ఈ పోటీలకు తెర‌లేవ‌నుంది. మొత్తం క్రీడా ప్రపంచానిక ఆసక్తిగా దాయ‌క‌మైప‌ విశ్వ క్రీడల సంబరానికి పారిస్ న‌గ‌రం ముస్తాబైంది. జూలై 26 న (శుక్ర‌వారం) ప్రారంభమై ఆగస్టు 11న ఈ ఒలింపిక్స్ సంరంభం ముగియ‌నుంది. మొత్తం 17 రోజుల పాటు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 206 దేశాల నుంచి మొత్తం 10,714 మంది క్రీడాకారులు పాల్గొంటారు. 32 క్రీడలకు సంబంధించి 329 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 2024 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఆఫ్రికా నుంచి 54, యూరప్ నుంచి 48, ఆసియా నుంచి 44, అమెరికా నుంచి 41, ఓషియానియా నుంచి 17, ఇండివిడ్యువల్ న్యూట్రల్ అథ్లెట్స్, రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ నుంచి మొత్తం 206 జాతీయ జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కోవిడ్ తర్వాత తొలిసారి ఇది ప్రేక్షకుల మధ్య జరగనుంది. దాంతో తమ దేశ క్రీడాకారులను ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు ఆయా దేశాల క్రీడాభిమానులు స‌మాయత్త‌మ‌య్యారు. ఇప్ప‌టికే ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి క్రీడాభిమానులు పారిస్ నగ‌రానికి చేరుకున్నారు. క్రీడాకారులు, క్రీడాభిమానులతో విశ్వ నగరం కొత్త శోభలు సంతరించుకుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన విష‌యం విదిత‌మే. మొత్తం 329 బంగారు పతకాల కోసం పోటీపడుతున్నారు. ఆక్వాటిక్స్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కానోయింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, హాకీ, ఫుట్‌బాల్, గోల్ఫ్‌, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, జూడో, పెంటాథ్లాన్, రగ్బీ సెవెన్స్, సెయిలింగ్, షూటింగ్, స్కేట్‌బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నిస్, ట్రయాథ్లాన్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ విభాగాల్లో పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అమెరికా అత్యధికంగా 588 మంది అథ్లెట్లను పంపుతోంది. రష్యా, బెలారస్ నుంచి కూడా 45 మంది అథ్లెట్లు రానున్నారు. ఈ రెండు దేశాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెండ్ చేసిన విష‌యం విదిత‌మే. దాంతో వారు తటస్థ అథ్లెట్లుగా పోటీ పడతారు. టోక్యోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం సహా ఏడు పతకాలు గెలిచింది. ఈ సారి భారత్‌ నుంచి 117 మంది క్రీడాకారులు.. 15 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది వెళ్లనున్నారు. బాక్సింగ్ , బ్మాడ్మింటన్ , అథ్లెటిక్స్ , ఆర్చరీ , వెయిట్‌లిఫ్టింగ్‌, హాకీ, రెజ్లింగ్‌, షూటింగ్ విభాగాల్లో మ‌న‌కు బంగారు ప‌త‌కాలు ల‌బించే అవకాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని క్రీడాభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే హాకీలో మ‌న దేశం ఎనిమిది స్వర్ణాలు గెలిచింది. ఈ సారి గ‌తంలో నెల‌కొన్న ఎన్నో రికార్డులు బ‌ద్ద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఒలింపిక్స్‌ చరిత్రలో ఇప్పటివరకూ మ‌న దేశం18 సార్లు నాలుగో స్థానంలో నిలిచింది. ఇక భారత్ నుంచి ఈసారి 117 మంది క్రీడాకారులు ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. భార‌త్ బృందానికి టార్చ్‌ బేరర్లుగా పీవీ సింధు, శరత్ కమల్‌ వ్యవహరించనున్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రస్తానం ఆర్చరీ పోటీలతో ప్రారంభమవుతుంది. జులై 27న బ్యాడ్మిండన్‌, బాక్సింగ్.. ఆగస్టు 1 నుంచి 11 వరకు అథ్లెటిక్స్‌ జరుగుతాయి. అలాగే జూన్ 27 నుంచి ఆగస్టు 8 వరకు హాకీ పోటీలు, జులై 27 నుంచి ఆగస్టు 5 వరకు షూటింగ్ పోటీలు జరుగుతాయి.

- Advertisement -

మొత్తం రూ.61,500 కోట్లు ఖర్చు అంచ‌నా

పారిస్‌ క్రీడల నిర్వహణకు మొత్తం రూ.61,500 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. ఈసారి పారిస్‌తో పాటు ఫ్రాన్స్‌లోని 16 వేర్వేరు నగరాల్లో ఈ క్రీడలు నిర్వహించనున్నారు. ఒలింపిక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు పతకం, రెండో వారికి రజత పతకం, మూడో వారికి కాంస్య పతకం అందజేస్తారు. ప్రస్తుతం అనేక క్రీడలలో నాల్గవ స్థానంలో నిలిచే ఆటగాడికి కూడా కాంస్య పతకాన్ని అందిస్తున్నారు. దానిక‌నుగుణంగా మొత్తం 5084 పతకాలు సిద్ధం చేశారు. ఇందులో బంగారు పతకం బరువు 529 గ్రాములు , వెండి పతకం బరువు 525 గ్రాములు. కాంస్య పతకం 455 గ్రాములు ఉంటుంది. బంగారు పతకం లో 92.5 శాతం వెండి – 6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా, వెండి పతకంలో 92.5 శాతం వెండి, కాంస్య పతకంలో 97 శాతం రాగి ఉంటుంది. పతకానికి ఈఫిల్ టవర్ నుండి ఇనుప ముక్కను చేర్చారు. ఒక్కో మెడల్‌లో ఈఫిల్ టవర్ ముక్క బరువు 18 గ్రాములు. సరిగ్గా వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తోంది ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌. ఒలింపిక్స్‌లో మొదటిసారి (1900లో) మహిళా క్రీడాకారులు పాల్గొన్నది ఈ నేలపైనే. ఈసారి ఒలింపిక్స్‌లో పురుషులతో దాదాపు సమాన సంఖ్యలో మహిళా క్రీడాకారులు(5250) పాల్గొంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News