ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18వ సీజన్ ఫైనల్ స్టేజ్ కి చేరింది. ఎన్నో సంవత్సరాలుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న రెండు జట్లు ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ ఇప్పుడు తమ తొలి కప్పు కోసం తలపడనున్నాయి. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ను ఓడించి, ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. ఈ విజయంలో పంజాబ్ బ్యాటర్లు చూపించిన దూకుడు, ఆటపై పట్టుదల వారికి విజయాన్ని అందించింది.
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే 207 పరుగులు చేసి సునాయాసంగా ఛేదించింది. ప్రారంభంలో తమ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ (6) మరియు ప్రియాంశ్ ఆర్య (20) త్వరగా ఔటైనా, మిగతా బ్యాటర్లు పూర్తి నియంత్రణతో ఇన్నింగ్స్ నడిపించారు. మూడో ఓవర్లోనే ప్రభ్ ఔటవ్వడంతో పంజాబ్ తొలుత ఒత్తిడిలో పడినట్లుగా కనిపించింది. కానీ అదే సమయంలో క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్ దూకుడు చూపించి మ్యాచ్ మూడవ గేర్లోకి తీసుకెళ్లాడు. టోప్లీ, బుమ్రా లాంటి తలపడే బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కున్నాడు. బుమ్రా ఓ ఓవర్లోనే రెండు సిక్సులు, రెండు ఫోర్లతో 20 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.
ఇంగ్లిస్ ఔటయ్యే సమయానికి పంజాబ్ 8 ఓవర్లలోనే బాగానే ముందంజలో ఉంది. తర్వాత ఆ బాధ్యత తీసుకున్న శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరాల జోడీ స్కోర్ను ముందుకు నడిపింది. ముఖ్యంగా శ్రేయస్ తన క్లాస్ బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. టోప్లీ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సులతో పంజాబ్ ని మంచి స్థితిలో నిలబెట్టాడు. మరోవైపు నేహాల్ వధేరా 48 పరుగులు చేసి అవుటైనా, అదే ఓవర్లో మంచి పరుగులు వచ్చాయి. చివర్లో వచ్చిన శశాంక్ రనౌట్ అయినా, శ్రేయస్ అయ్యర్ మాత్ర పోరాడాడు.. 87 పరుగులు చేసి నానౌట్ గా నిలిచి.. జట్టును విజయం వైపు నడిపించించాడు.
ముంబై బౌలర్లుగా పేరొందిన ఆటగాళ్లే ఈరోజు పంజాబ్ బ్యాటింగ్ మైదానంలో నీరుగారిపోయారు. చివరికి పంజాబ్ తమ ఫైనల్ టికెట్ను దక్కించుకుంది. దీంతో టైటిల్ గెలవని రెండు జట్లు.. ఆర్సీబీ – పంజాబ్ ఫైనల్ పోరులో తలపడబోతున్నాయి. ఎవరైనా ఒకరు చాంపియన్గా చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నారు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన మాత్రం అభిమానులకు చిరస్మరణీయంగా మిగిలిపోనుంది.