PV Sindhu: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు (PV Sindhu) మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ టోర్నమెంట్లో ఘన విజయంతో బోణీ కొట్టిన ఆమె.. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ టాప్-10 ర్యాంకింగ్స్లోకి ఘనంగా రీ-ఎంట్రీ ఇచ్చింది.
ఉత్కంఠ పోరులో ఘన విజయం: ఇండోనేషియా ఓపెన్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో థాయ్లాండ్కు చెందిన బలమైన ప్రత్యర్థి బుసానన్తో సింధు తలపడింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు ఆటగాళ్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే తన అద్భుతమైన నైపుణ్యానికి అనుభవాన్ని జోడించి.. 25-23, 21-16 తేడాతో వరుస సెట్లలో బుసానన్ను మట్టికరిపించింది. ఈ విజయంతో ఆమె టోర్నీలో ప్రీ-క్వార్టర్స్కు అర్హత సాధించింది.
మళ్లీ టాప్-10 లోకి పీవీ సింధు: ఈ అద్భుత విజయంతో పాటు జూన్ 2న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) విడుదల చేసిన తాజా అధికారిక ర్యాంకింగ్స్ ప్రకారం.. పీవీ సింధు ప్రపంచంలోనే 10వ స్థానానికి చేరుకుంది. 2023 సంవత్సరం తర్వాత ఆమె మళ్లీ టాప్-10 లీగ్లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత కొంతకాలంగా గాయాలు, ఫామ్ లేమితో ఇబ్బంది పడినప్పటికీ.. పట్టుదలతో తిరిగి పుంజుకుంది. టాప్-10 లోకి దూసుకొచ్చిన సింధుపై అభిమానులు, క్రీడా ప్రముఖుల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

