IND vs ENG Test Series: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక సిరీస్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సిరీస్కు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని నామకరణం చేశారు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఇవాళ మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. మ్యాచ్ జరిగే హెడింగ్లీలో ఐదు రోజసుల పాటు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ జరిగే రెండు, మూడు రోజుల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఇంగ్లాండ్లో క్రికెట్ మ్యాచులు జరిగే సమయంలో వర్షాలు పడటం, వాతావరణ పరిస్థితులు మారడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో వరుణుడు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వర్షం పడే అవకాశం ఉండంట మ్యాచ్ విజయాలపై తీవ్ర ప్రభావం చూపే వీలుంది. ఇది కచ్చితంగా టీమిండియా విజయాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. అందులోనూ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వీడ్కోలు పలకడం యువ భారత జట్టుకు ఈ సిరీస్ కఠిన సవాలుగా మారనుంది. మరి వాతావరణ సవాళ్లను అధిగమించి గిల్ సేన ఎలా రాణిస్తుందో చూడాలి.
మరోవైపు ఈ సిరీస్లో భారత జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమిండియా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు కచ్చితంగా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని తెలిపాడు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడన్నాడు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సత్తా చాటుతారని పేర్కొన్నాడు. అయితే వర్క్లోడ్ కారణంగా బుమ్రా ఈ సిరీస్లో కొన్ని మ్యాచులు మాత్రమే ఆడనున్నాడు. కానీ ఏఏ మ్యాచ్ల్లో ఆడతాడనేది ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.
ఇక ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు యువ భారత జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. బెన్ స్టోక్స్, జో రూట్, డకెట్, బ్రూక్ వంటి పటిష్ట బ్యాటింగ్ ఆర్డర్తో పాటు పేస్ బౌన్స్తో భయపెట్టే బౌలర్లు కూడా ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరి సీనియర్లతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ జట్టును యువ భారత్ ఎలా ఎదుర్కోనుందనే వేచి చూడాలి.