ఐపీఎల్(IPL) 2025 సీజన్లో అద్భుతమైన ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. 2008లో లీగ్ ప్రారంభమైన నాటి నుంచి ఆర్సీబీ ఇంతవరకు కప్ గెలవలేదు. ప్రతి ఏడాది ‘ఈ సాలా కప్ నమ్దే’ అని ఫ్యాన్స్ ఆశపడటం.. ఆర్సీబీ కప్ గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడం సాధారణం అయిపోయింది. ఈసారి ఫైనల్కు చేరడంతో కప్ గెలవడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్సీబీ ఫ్యాన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖ వైరల్గా మారింది.
బెలగావి జిల్లాకు చెందిన శివానంద్ మల్లన్నవర్ ఆ లేఖ రాశారు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిస్తే ఆ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని అభ్యర్థించాడు. ఆర్సీబీ అభిమానులు ప్రతి ఏడాది ఆ రోజును వేడుకగా జరుపుకునేందుకు పబ్లిక్ హాలిడే ఇవ్వాలన్నాడు. కర్ణాటక రాజ్యోత్సవ మాదిరిగా ‘ఆర్సీబీ ఫ్యాన్స్ ఫెస్టివల్’గా ప్రకటించాలని లేఖలో కోరాడు. ఆర్సీబీ విజేతగా నిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఏర్పాట్లు చేయాలన్నాడు. మల్లన్నవర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు, అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
