2025 ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకొని.. 18 సంవత్సరాల కలను నిజం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) భవిష్యత్తుపై నీలినీడ కమ్ముకుంది. ఈ సాల కప్ నందే అంటూ అభిమానులకు తీపి కానుక అందించిన కోహ్లీ టీం.. ఇదే తమ చివరి ఐపీఎల్ అనే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆర్సీబీకి వచ్చిన కష్టమేంటి.. వచ్చే ఐపీఎల్ లో ఆర్సీబీ కనిపించడా.. ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించుకున్న ఆల్కహాల్ కంపెనీ డయాజియో, ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీని పూర్తిగా లేదా, పాక్షికంగా విక్రయించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనంగా ప్రచురించగా.. ఈ విషయంలో ఇప్పటికే డయాజియో, ఆర్థిక సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. RCB ప్రస్తుతం సుమారుగా 2 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఫ్రాంచైజీగా పేరుంది.. కానీ దీనిపై కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే డయాజియో ఆర్సీబీని విక్రయించాలనుకునే వెనుక వ్యాపారపరమైన, నైతికమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. తీసుకున్న కొన్ని నిర్ణయాలు డయాజియో లాంటి ఆల్కహాల్ బ్రాండ్లకు ఆటంకంగా మారుతున్నాయి. నిజానికి క్రికెట్ వంటి పాపులర్ క్రీడా వేదికలపై పొగాకు, మద్యం ఉత్పత్తులకు పరోక్ష ప్రమోషన్ నిషేధించాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. దీంతో మద్యం వ్యాపారానికి సంబంధించిన బ్రాండ్లు క్రీడా రంగంలో నేరుగా భాగస్వాములు కావడాన్ని సమీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
మరోకోణంలో చూస్తే.. అమెరికాలో విస్తరించిన డయాజియో వ్యాపారంపై అక్కడి సుంకాల పెరుగుదల, వినియోగదారుల సంఖ్య తగ్గడముతో ప్రభావం పడింది. ఫలితంగా కంపెనీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో నాన్-కోర్ వ్యాపారాలైన ఆస్తులను అమ్మే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్సీబీ విక్రయం వల్ల సమకూరే నిధులను ప్రధాన వ్యాపారాల్లో మళ్లించాలన్నది డయాజియో వ్యూహంగా కనిపిస్తోంది.
గమనించదగ్గ విషయం ఏంటంటే… ఒకప్పుడు విజయ్ మాల్యా చేతుల్లో ఆర్సీబీ ప్రారంభమైంది. ఆయన ఆధ్వర్యంలో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి హైలైట్ అయిన జట్టుకు, 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాళా కారణంగా తీవ్రంగా దెబ్బ తగిలింది. అనంతరం విజయ్ మాల్యా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన డయాజియో, ఆర్సీబీపై యాజమాన్య హక్కులను పొందింది. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్.. మరోవైపు తమ జట్టు ఇక ఎవరి చేతిలోకి వెళ్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ వేరే వాళ్లు ఆర్సీబీని కొనుగోలు చేస్తే.. దాని పేరు మారుస్తారా, కొత్త పేరు పెడతారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్సీబీ భవితవ్యం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.