ఐపీఎల్ 2025లో ఆర్సీబీ దూకుడు కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు ఆనందంలో ముంచేసింది. కీలకమైన క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. ప్రత్యర్థిపై అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ ఫైనల్కు అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. తమ నిర్ణయం ఎంత మంచిదో చూపించింది. మొదటి నుంచే పంజాబ్ బ్యాట్స్మెన్ను ఒత్తిడిలోకి నెట్టింది. 50 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుదేలైంది. ఒక్క ఆటగాడు కూడా 30 మార్క్ దాటి స్కోర్ చేయలేకపోయాడు. స్టోయినిస్ చేసిన 26 పరుగులే పంజాబ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్. సుయాశ్ శర్మ, జాష్ హేజిల్వుడ్లు తలో మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ను షాక్కి గురిచేశారు. యశ్ దయాల్ రెండు వికెట్లు తీసి మద్దతిచ్చాడు. భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా 14.1 ఓవర్లలోనే పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆర్సీబీ డామినేషన్ అక్కడితో ఆగలేదు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధాటిగా ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 56 పరుగులు చేసి మ్యాచ్ని ఫినిష్ లైన్కి చేర్చేశాడు. 10 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ మ్యాచ్ ముగించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ చూపిస్తున్న ఆటతీరు చూస్తే.. టైటిల్కు ఇది బెస్ట్ ఛాన్స్ అనిపిస్తోంది. ఆటగాళ్లంతా టాప్ ఫామ్లో ఉండటంతో ఆర్సీబీకి ఈసారి కప్ సాధిస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.