ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆశలు క్వాలిఫయర్-2లోనే గల్లంతయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించేసింది. ముంబై మొదట బ్యాటింగ్ చేసి 203 పరుగుల భారీ స్కోరు చేయగా, శ్రేయస్ అయ్యర్ 87 నాటౌట్తో ప్రత్యర్థి జట్టును గెలిపించి ఫైనల్ టికెట్ దక్కించిపెట్టాడు.
ఈ ఓటమితో ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్కి ఈ సీజన్ ముగిసిపోయింది. కానీ మ్యాచ్కి అనంతరం జట్టు క్యాంప్లో చోటుచేసుకున్న ఎమోషనల్ విజువల్స్ మాత్రం అభిమానుల గుండెల్ని గట్టిగా తాకాయి. ముంబైకి ఎన్నో గెలుపులు అందించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ జట్టులోని సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ టీమ్తో ఒక్కొక్కరిని కలిసి వీడ్కోలు పలకడం ఒక భావోద్వేగ క్షణంగా మారింది.
ఎయిర్పోర్ట్లో రోహిత్ను కలిసిన వారిలో అర్జున్ టెండూల్కర్ కూడా ఉండడం, వాళ్లిద్దరి మధ్య జరిగిన చిన్న చిట్చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని “పాసింగ్ ది టార్చ్” మూమెంట్గా అభివర్ణిస్తున్నారు. రోహిత్కు ఇది ముంబై తరఫున చివరి సీజన్ కావచ్చన్న ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ సీజన్లో ముంబై జర్నీ హ్యాపీగా మొదలవ్వలేదు. మొదటి నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి, ప్లేఆఫ్ ఆశలు ప్రశ్నార్థకంగా మారాయి. కానీ ఢిల్లీపై వచ్చిన థ్రిల్లింగ్ విన్తో మోమెంటం అందుకుంది. సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా ఫామ్లోకి రాగానే, ఆ జట్టు వరుసగా ఆరు విజయాలు సాధించి టాప్ 4లోకి దూసుకెళ్లింది.
ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన మ్యాచ్లో రోహిత్ శర్మ 81 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వడమే కాకుండా, మరోసారి ఐపీఎల్ టైటిల్ ఆశలు నెలకొల్పాడు. కానీ ఆ ఆశలు క్వాలిఫయర్-2లో పంజాబ్ చేతిలో ఓటమితో ఆగిపోయాయి. ఓటమి తర్వాత ముంబై కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ, “కొన్ని కీలకమైన మిస్స్టెప్స్ మ్యాచ్పై ప్రభావం చూపించాయి. బ్యాక్ టు బ్యాక్ వికెట్లతో మొమెంటం కోల్పోయాం. స్కోరు బాగున్నా, గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం. అయినా మధ్యలో బాగా రాబౌన్స్ అయ్యామని.. తమ జట్టు ఆటతీరుపై గర్వపడుతున్నా అని స్పష్టం చేశాడు.