Saina Nehwal says goodbye to badminton: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎన్నో సంచలనాలకు కారణమైన దిగ్గజ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ తన అద్భుతమైన కెరీర్కు ముగింపు పలికింది. గత రెండేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బ్యాడ్మింటన్కు దూరంగా ఉన్న ఆమె, తన శరీరం ఇక బ్యాడ్మింటన్ పోటీలకు సహకరించడం లేదని, ప్రొఫెషనల్గా ఆడలేనని స్పష్టం చేసింది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ, తాజాగా ఒక పాడ్కాస్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలతో తన ప్రస్థానం ముగిసినట్లు తేలిపోయింది. రిటైర్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదనుకుంటున్నానని సైనా పేర్కొంది. ఈ సందర్భంగా భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్, సైనాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె కెరీర్ను ప్రశంసించాడు. “అద్భుతమైన కెరీర్కు అభినందనలు సైనా! నువ్వు భారత బ్యాడ్మింటన్ను ముందుకు నడిపి, ఒక తరానికి స్ఫూర్తిగా నిలిచావు. నీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్” అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అయితే, మోకాలిలోని కార్టిలేజ్ పూర్తిగా దెబ్బతినడం, ఆర్థరైటిస్ సమస్యల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సైనా వివరించింది. “ప్రపంచంలో అత్యుత్తమంగా రాణించాలంటే రోజుకు 8 నుంచి 9 గంటలు శిక్షణ తీసుకోవాలి. కానీ ఇప్పుడు గంట, రెండు గంటలకే నా మోకాలు వాచిపోయి, నొప్పి మొదలవుతోంది. ఆ తర్వాత ఆడటం చాలా కష్టంగా మారింది. ఇక నా శరీరాన్ని ఇంతకంటే కష్టపెట్టలేననిపించింది. అందుకే చాలనుకున్నాను” అని ఆమె భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించింది.
కెరీర్ మొత్తం 24 అంతర్జాతీయ టైటిల్స్..
హర్యానాలోని హిస్సార్లో 1990 మార్చి 17న జన్మించిన సైనా నెహ్వాల్ జీవితం, ఆమె తండ్రి డాక్టర్ హర్వీర్ సింగ్ హైదరాబాద్కు బదిలీ కావడంతో కీలక మలుపు తిరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ఆయన ఉద్యోగ రీత్యా 1998లో హైదరాబాద్కు మారారు. ఇక్కడ స్థానిక భాష రాకపోవడంతో ఒంటరిగా భావించిన సైనా, తన తల్లి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. ఆమె ప్రతిభను గుర్తించిన తండ్రి, లాల్ బహదూర్ స్టేడియంలో కోచింగ్కు పంపించారు. కూతురి శిక్షణ కోసం తన పీఎఫ్ డబ్బును ఖర్చు చేయడమే కాకుండా, ప్రమోషన్లను కూడా వదులుకుని ఆయన చేసిన త్యాగం, సైనాను ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది. అనంతరం ఆమె ప్రపంచ అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళగా, అదే ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్గా సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. 2009లో ఇండోనేషియా ఓపెన్ గెలిచి, బీఎంఎఫ్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. 2010లో ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించింది. ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం 2012 లండన్ ఒలింపిక్స్. ఈ పోటీల్లో కాంస్య పతకం గెలిచి, బ్యాడ్మింటన్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 2015లో వరల్డ్ నంబర్ 1 ర్యాంకును అందుకుని, ప్రకాశ్ పదుకొణే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయురాలిగా చరిత్రకెక్కింది. సైనా తన కెరీర్లో మొత్తం 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకుంది. బ్యాడ్మింటన్ రంగంలో ఆమె ఘనతకు గానూ ప్రభుత్వం అర్జున అవార్డు (2009), రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (2010), పద్మ శ్రీ (2010), పద్మ భూషణ్ (2016) పురస్కారాలతో సత్కరించింది. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటన చేయకపోయినా, సైనా మాటలతో భారత బ్యాడ్మింటన్లో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది. ఆమె పోరాట పటిమ, విజయాలు లక్షలాది మంది యువతకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి.

