టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Chahal), అతని భార్య ధనశ్రీ(Dhanashree) పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధనశ్రీకి భరణం కింద రూ. 4.75 కోట్లు చెల్లించేందు చాహల్ అంగీకరించినట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇందులో భాగంగా అతడు ఇప్పటికే రూ.2.37 కోట్లు చెల్లించాడు.
కాగా గతంలో కొన్నాళ్లు పాటు ప్రేమించుకున్న చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి పిటిషన్పై విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ జంట దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో ఓ షాకింగ్ విషయం బటయకు వచ్చింది. వీరిద్దరికి 2020 డిసెంబర్లో పెళ్లవగా 2022 జూన్ నుంచే వేర్వేరుగా ఉంటున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అంటే కేవలం ఏడాదిన్నర మాత్రమే వీరు కలిసి ఉన్నారనే సంగతి తెలుసుకుని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే చాహల్ వేరే అమ్మాయితో ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారు.