T20 Mumbai League 2025: నాయకుడిగా అతని విజయాలుశ్రేయస్ అయ్యర్… ఈ పేరు ఇటీవల కాలంలో క్రికెట్లో ఒక విజయానికి పర్యాయపదంగా మారింది. టీమ్ను లీడ్ చేయడం తనకెంతో ఇష్టమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్వయంగా పేర్కొన్నారు. ఇటీవల అతడి సారథ్యంలో జట్ల ప్రదర్శన చూస్తే, నాయకుడిగా అతడి అసమాన ప్రతిభ ఏంటో స్పష్టమవుతుంది. కేవలం బ్యాటింగ్తోనే కాకుండా, కెప్టెన్సీ బాధ్యతలతోనే తనలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుందని శ్రేయస్ బలంగా విశ్వశిస్తున్నాడు.
“హిట్ ట్రాక్” రికార్డ్తో దూసుకుపోతున్న అయ్యర్:
గడిచిన సంవత్సరం నుంచి శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించిన ప్రతి జట్టు ఫైనల్కు దూసుకెళ్లడం విశేషం. ఇది అతడిలోని నాయకత్వ లక్షణాలకు, వ్యూహాత్మక ఆలోచనలకు తిరుగులేని నిదర్శనం. ముఖ్యంగా 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా టైటిల్ అందించడంతో అతడి “హిట్ ట్రాక్” మొదలైంది. ఆ తర్వాత 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చి రన్నరప్గా నిలబెట్టడం ద్వారా, రెండు విభిన్న జట్లను విజయపథంలో నడిపించగల సామర్థ్యం అతడికి ఉందని స్పష్టమైంది.
దేశవాళీ క్రికెట్లోనూ కెప్టెన్గా సత్తా:
ఐపీఎల్తో పాటు, దేశవాళీ క్రికెట్లోనూ శ్రేయస్ తన కెప్టెన్సీ ముద్ర వేశాడు. అతడి సారథ్యంలో ముంబయి టీమ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్కు చేరగా.. తాజాగా ముంబయి టీ20 లీగ్లో సోబో ముంబయి ఫాల్కన్స్ను కూడా ఫైనల్కు తీసుకెళ్లాడు. రంజీ ట్రోఫీలోనూ అతడి నాయకత్వ పటిమ కనబడింది.
పరిణితి చెందిన నాయకుడు:
22 ఏళ్ల వయసు నుంచే కెప్టెన్గా వ్యవహరిస్తున్నందున, క్రికెట్లోని ఒడిదుడుకులను అర్థం చేసుకునే పరిణతి, అనుభవం శ్రేయస్కు పుష్కలంగా ఉన్నాయి. జట్టు నాయకుడిగా ఒత్తిడిలోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే తీరు అయ్యర్ గెలుపుకి కారణమంటున్నారు. ఇది అతడిని మరింత సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దుతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.