Shubman Gill: ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో టీమ్ఇండియా యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ దుమ్మురేపుతున్నాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (147) చేసిన శుభ్మన్.. రెండో ఇన్నింగ్స్లో 8 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో (269) గిల్ రెచ్చిపోయాడు. ఆ వెంటనే రెండో ఇన్నింగ్స్లోనూ సూపర్ సెంచరీతో (161) అలరించాడు. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ భీకర ఫామ్లో ఉన్న వేళ.. రెండో టెస్టులో టీమ్ ఇండియా గెలుపు దగ్గర్లో ఉంది. ఒకే టెస్టులో వరుస సెంచరీలు బాదిన గిల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
ఇంగ్లండ్తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 430 పరుగులు చేశాడు. దీంతో ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అయితే తొలిస్థానంలో గ్రాహం గూచ్ (456 పరుగులు) మొదటి స్థానంలో ఉన్నాడు. ఒకే టెస్టు మ్యాచ్లో రెండు 150 ప్లస్ పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఇందులో గిల్ కంటే ముందు అలెన్ బోర్డర్ మొదటి స్థానంలో ఉన్నాడు. బోర్డర్ 1980లో పాకిస్థాన్ జట్టుపై వరుసగా 150, 153 రన్స్ చేశాడు. ఒకే టెస్టు మ్యాచ్లో సెంచరీ, డబుల్ సాధించిన తొమ్మిదో బ్యాటర్గా నిలిచిన ఘనత గిల్ సాధించాడు. ఈ జాబితాలో భారత్ నుంచి సునీల్ గవాస్కర్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు గిల్ వచ్చి చేరాడు.
లెజండరీ క్రికెటర్లు అయిన సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ తర్వాత టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేసిన 3వ టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ మరో రికార్డు సాధించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గిల్ నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే ఒకే టెస్టు మ్యాచ్లో నాలుగు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమైన తొలి భారత ఆటగాడిగా శుభ్మన్ గిల్ నిలిచాడు. ఈ సిరీస్లో భాగంగా మరో మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో కెప్టెన్ గిల్ మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.