T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్కు ముందు భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. కీలక ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఫిట్నెస్ సాధించడం టీమ్ ఇండియాకు భారీ ఊరటనిచ్చే అంశం.
తిలక్ వర్మ పునరాగమనం
అబ్డామినల్ సర్జరీ (కడుపు సంబంధిత శస్త్రచికిత్స) తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణ పొందుతున్న తిలక్ వర్మ, దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించారు. శుక్రవారం జరిగే సిమ్యులేషన్ మ్యాచ్ అనంతరం ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3న ముంబైలో తిలక్ వర్మ భారత జట్టుతో కలిసే అవకాశం ఉంది. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల నాటికి ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నారు.
మళ్లీ దూసుకొస్తున్న మయాంక్
గత ఏడాది కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న యువ పేసర్ మయాంక్ యాదవ్ తిరిగి లయ అందుకున్నారు. ఐపీఎల్ 2024లో తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచిన మయాంక్, గాయం కారణంగా 2025 సీజన్లో కేవలం రెండు మ్యాచ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆయన, టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ల్లో ఇండియా-ఎ తరపున బరిలోకి దిగనున్నారు.
Also Read: Match fixing -క్రికెట్లో మళ్లీ ఫిక్సింగ్ భూతం.. అమెరికా స్టార్ క్రికెటర్ పై ఐసీసీ నిషేధం!
పరాగ్, సుందర్ ఎలా ఉన్నారంటే..
కుడి భుజం గాయంతో జట్టుకు దూరమైన రియాన్ పరాగ్ కూడా కోలుకున్నారు. శుక్రవారం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ తర్వాత ఆయన ఫిట్నెస్పై స్పష్టత రానుంది. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడిన సుందర్ ఇంకా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయనకు కూడా సిమ్యులేషన్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ముందు తిలక్ వర్మ వంటి నిలకడైన ఆటగాడు, మయాంక్ యాదవ్ వంటి ఎక్స్ప్రెస్ పేసర్ అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని రెట్టింపు చేస్తుంది.

