Team India New Record: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో ఐదు సెంచరీలు నమోదు చేశారు. తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్(101), శుభమన్ గిల్(147), రిషభ్ పంత్(134) సెంచరీలు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్(118) సెంచరలు చేశారు. దీంతో ఓ టెస్టు మ్యాచ్లో భారత్ తరుపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి.
1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న టీమిండియా తొలిసారి ఈ రికార్డును సాధించిన చరిత్ర సృష్టించింది. గతంలో పలు మ్యాచుల్లో టీమిండియా తరుపున నాలుగు శతకాలు నమోదయ్యాయి. అయితే ఐదు శతకాలు మాత్రం నమోదు కావడం ఇదే ఫస్ట్. అంతేకాకుండా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగానూ భారత్ రికార్డు నెలకొల్పింది. 70 ఏళ్ల క్రితం వెస్టిండీస్ పర్యటన సందర్భంగా ఓ టెస్టు మ్యాచ్లో ఐదుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సెంచరీలు చేశారు. మళ్లీ ఇప్పుడు భారత ఆటగాళ్లు ఆతిథ్య జట్టుపై ఐదు సెంచరీలు నమోదు చేశారు.
ఇక తొలి టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. 371 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21/0 పరుగులు చేసింది. క్రీజులో బెన్డకెట్ (9), జాక్ క్రాలీ (12) ఉన్నారు. చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విజయం సాధించాలంటే 90 ఓవర్లలో ఇంగ్లాండ్ 350 పరుగులు చేయాలి. టీమిండియా 10 వికెట్లు తీయాలి. లేదంటే మ్యాచ్ డ్రాగా ముగియనుంది.
అంతకుముందు రెండో ఇన్నింగ్సులో భారత జట్టు 464 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్, పంత్ సెంచరీలతో అదరగొట్టారు. అయితే మిగతా బ్యాటర్లు నుంచి సహకారం లభించకపోవడంతో 500 పరుగులు మార్క్ దాటలేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రాస్ 3, జోష్ టంగ్ 3, బషీర్ 2, వోక్స్ ఓ వికెట్ తీశారు