జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో(Pahalgam Terror Attack) పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించాలని నిర్ణయించింది. ఇవాళ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్లో ఆటగాళ్లు, అంపైర్లు నల్లటి బ్యాండ్లు ధరించాలని ఆదేశించింది.
అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ళు ఒక నిమిషం మౌనం పాటించి ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించనున్నారు. అంతేకాకుండా స్టేడియంలో టపాసులు కాల్చడం, చీర్ లీడర్లు డ్యాన్స్లను నిషేధించింది. కాగా ఈ ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) హస్తం ఉందని తేలింది. జమ్మూకాశ్మీర్లో 56 మంది విదేశీ టెర్రరిస్టులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ముఠా సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నాయి.