ఐపీఎల్ 2025 సీజన్లో శనివారం జరిగే మరో హై-వోల్టేజ్ మ్యాచ్కు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్న ఈ మ్యాచ్పై భారీ అచనాలు ఉన్నాయి. అయితే మ్యాచ్కు ముందే అందరి దృష్టి ఆర్సీబీ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీపై నిలిచింది. ఈ మ్యాచ్లో కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. చెన్నైపై 51 పరుగులు సాధిస్తే, ఐపీఎల్లో ఒక్క జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటివరకు చెన్నైపై 34 మ్యాచ్ల్లో 1084 పరుగులు చేసిన కోహ్లీ, మరో 51 పరుగులు చేస్తే డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడిగా నిలుస్తారు. పంజాబ్ కింగ్స్పై వార్నర్ 26 మ్యాచ్ల్లో 1134 పరుగులు చేశారు.
ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లపై వెయ్యి పరుగుల మైలురాయిని దాటిన ఏకైక ఆటగాడు కూడా కోహ్లీనే. ఢిల్లీ క్యాపిటల్స్పై 1130, పంజాబ్ కింగ్స్పై 1104 పరుగులు సాధించిన కోహ్లీ, చెన్నైపై కూడా ఈ ఘనతకు చేరువగా ఉన్నాడు.
ఇతర టాప్ స్కోరర్లు:
డేవిడ్ వార్నర్ – 1134 (పంజాబ్ కింగ్స్పై)
విరాట్ కోహ్లీ – 1130 (ఢిల్లీ క్యాపిటల్స్పై)
విరాట్ కోహ్లీ – 1104 (పంజాబ్ కింగ్స్పై)
డేవిడ్ వార్నర్ – 1093 (కోల్కతా నైట్రైడర్స్పై)
విరాట్ కోహ్లీ – 1084 (చెన్నై సూపర్ కింగ్స్పై)
రోహిత్ శర్మ – 1083 (కోల్కతా నైట్రైడర్స్పై)
ఇక ఈ సీజన్లో కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ పోటీలో ఐదో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ, ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. RCB ఈ సీజన్లో మెరుగైన ఫామ్లో ఉంది. 10 మ్యాచ్ల్లో 7 విజయాలు, 3 ఓటములతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. నెట్రన్రేట్ +0.521తో ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చెన్నైపై విజయం సాధిస్తే రెండో స్థానానికి చేరుకునే అవకాశముంది.