ఈ ఏడాది ప్రపంచ క్రికెట్ అభిమానులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు ఊహించని రీతిలో రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకగా.. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు, సౌతాఫ్రికా హార్డ్ హిట్లర్ హెన్రిచ్ క్లాసన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.
తాజాగా కరేబియన్ హిట్టర్ నికోలస్ పూరన్(Nicholas Pooran)కూడా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశాడు. రిటైర్మెంట్ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పూరన్ అధికారింగా వెల్లడించాడు. ఎంతో ఆలోచించిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించానని.. ఇది చాలా కష్టతరంతో కూడిన నిర్ణయమని తెలిపాడు.
కేవలం 29 ఏళ్ల వయసులోనే క్రికెట్కు గుడ్ బై చెప్పడంతో క్రికెట్ ప్రపంచం షాక్లో ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన పూరన్.. టీ20 లీగ్స్లలో మాత్రం కొనసాగనున్నాడు. వెస్టిండీస్ టీ20 జట్టుకు సారథిగా కూడా వ్యవహరించిన పూరన్.. మరో 8 నెలల్లో టీ20 వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులతో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డును విస్మయానికి గురిచేసింది.
వెస్టిండీస్ తరఫున 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పూరన్.. 106 టీ20లు, 61 వన్డేలు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి 4000కి పైగా పరుగులు చేశాడు. టీ20ల్లో 2,275, వన్డేల్లో 1,983 పరుగులతో రాణించాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పూరన్ చివరగా బంగ్లాదేశ్పై 2024 డిసెంబర్లో టీ20 క్రికెట్ ఆడాడు. కాగా ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.