ఐపీఎల్ 2025 సీజన్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్తో (Punjab Kings) తలపడనుంది. ఒకవేళ వర్షం కారణంగా గుజరాత్, ముంబై మధ్య జరగాల్సిన ఇవాళ్టి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు క్వాలిఫయర్ 2కు అర్హత సాధిస్తుంది. ముంబై ఇండియన్స్ ఇంటి బాట పడుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. కాబట్టి లీగ్ దశలో పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న గుజరాత్కు కలిసివస్తుంది. అయితే వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.