ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final)ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా రేపు(బుధవారం) నుంచి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు కూడా లార్డ్స్కు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి టెస్టు ఛాంపియన్ షిప్ గద ఎత్తుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.
వరుసగా రెండో సారి విజేతగా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. తొలిసారి ఐసీసీ టైటిల్ను ముద్దాడాలని దక్షిణాఫ్రికా జట్టు కోరుకుంటోంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఐదు రోజుల పాటు ఆట సజావుగానే సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ జూన్ 11 నుంచి 15 వరకు జరగనుంది. జూన్ 16 రిజర్వ్ డే కింద కేటాయించారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఆట ఆగిపోతే.. రిజర్వ్ డే మిగిలిన ఆట నిర్వహిస్తారు.
ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. భారత్ లో ఈ మ్యాచ్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లు సొంతం చేసుకున్నాయి. టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ లో అయితే జియో హాట్ స్టార్ వేదికగా లైవ్ చూడొచ్చు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు ఐసీసీ ఛైర్మన్ జైషా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా 2021లో జరిగిన తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిన్ టైటిల్ న్యూజిలాండ్ జట్టు గెలుచుకోగా.. 2023 WTC గదను ఆస్ట్రేలియా ముద్దాడింది. ఈ రెండు ఫైనల్ మ్యాచ్ లలో భారత్ రన్నరప్ గా నిలవడం గమనార్హం.