లండన్లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ అక్తికరంగా సాగుతోంది. ఓటమి దశ నుంచి సౌతాఫ్రికా జట్టు అద్భుతంగా పుంజుకుంది. నాలుగో ఇన్నింగ్స్ లో 282 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించే దిశగా దూసుకువెళ్తోంది. తొలిసారి డబ్ల్యూటీసీ గదను ముద్డాడటానికి మరో 69 పరుగులు దూరంలో మాత్రమే సఫారీ టీమ్ నిలిచింది. ఆస్ట్రేలియా గెలవాలంటే మాత్రం 8 వికెట్లు తీయాలి. అయితే ప్రొటీస్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్ (102), కెప్టెన్ టెంబా బవుమా(65) క్రీజులో పాతుకుపోయారు.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ ఆసీస్ గెలవడం కష్టం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదని.. తమ జట్టు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. మార్క్రమ్, బవుమాలో ఒక్కరు త్వరగా అవుటైనా అప్పుడు మ్యాచ్ తమ వైపు మళ్లే ఛాన్స్ ఉందని తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 212 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 74 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారు జట్టు 207 పరుగులు చేసింది. దీంతో మొత్తం 281 పరుగుల లీడ్ దక్కింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 213/2 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇక ఈ మ్యాచ్ లో శతకంతో చెలరేగిన మార్క్రమ్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్స్ల్లో దక్షిణాఫ్రికా తరుపున శతకం సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్స్లో సెంచరీ చేసిన మూడో బ్యాటర్గానూ నిలిచాడు. అతడి కన్నా ముందు ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఈ ఘనత సాధించారు.